Electronic Voting Machine: దీని జీవితకాలమెంతో తెలుసా?

22 Oct, 2021 15:04 IST|Sakshi

 1982లో తొలిసారిగా కేరళలో వినియోగం

వీటిని ఎవరూ ట్యాంపర్‌ చేయలేరు

ఒక్కో ఈవీఎం జీవితకాలం 15 ఏళ్లు

సాక్షి, కరీంనగర్‌: ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. పడగొట్టాలన్నా.. ఈ ఓటుతోనే సాధ్యం. దేశంలో 18సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయుడికి ఓటేయడం ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించే హక్కు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు బ్యాలెట్‌ (కాగితం)తోనే ప్రజలు ఓటు వేసేవారు. సాంకేతికతకు అనుగుణంగా ఓటింగ్‌ విధానంలోనూ మార్పులు వచ్చాయి. కాగితంతో లెక్కింపు, భద్రపరచడం తదితర కారణాలతో ఓటింగ్‌ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటుందని కేంద్రం గుర్తించింది. అందుకే, దేశంలో 1982 నుంచి ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈవీఎంలు అంటే ఏంటి? 
ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌. ఈవీఎంలు మొదటిసారిగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది కంట్రోల్‌ యూనిట్‌ కాగా, రెండవది బ్యాలెటింగ్‌ యూనిట్‌. కంట్రోల్, బ్యాలెటింగ్‌ యూనిట్లను ఒకేసారి కనెక్ట్‌ చేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ వద్ద ఉంటుంది. బ్యాలెటింగ్‌ యూనిట్‌లో ఓటర్లు ఓటు వేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లో ఉన్న బ్యాలెట్‌ బటన్‌ పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ ప్రెస్‌ చేసినప్పుడు మాత్రమే బ్యాలెటింగ్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగలడు. 
చదవండి: ఈ విషయం తెలుసా..? టీఆర్‌ఎస్‌కు మూడు గుర్తులు 

►ఒక్కసారి బ్యాలెట్‌ యూనిట్‌లో ఓటరు పక్కనున్న అభ్యర్థి బటన్‌ క్లిక్‌ చేయగానే లైట్‌ వెలుగుతుంది. వెంటనే బజర్‌ సౌండ్‌ వస్తుంది. తర్వాత ఈవీఎం లాక్‌ అవుతుంది. పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ కంట్రోల్‌ యూనిట్‌లో బటన్‌ ప్రెస్‌ చేస్తే తిరిగి ఓపెన్‌ అవుతుంది.

►ఈవీఎంలు నిమిషానికి ఐదు ఓట్లు మాత్రమే పరిమితం చేస్తాయి. ఈవీఎంలు 6 ఓల్ట్‌ అల్కాలైన్‌ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 క్యాండెట్స్‌ను ఉంచవచ్చు. అలా నాలుగు బ్యాలెట్‌ యూనిట్‌లను కనెక్ట్‌ చేయవచ్చు. 
చదవండి: Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు..

►ఒక్క నియోజకవర్గంలో 64 మంది క్యాండెట్స్‌కే పరిమితం ఉంటుంది. ఒకవేళ 64 మందికి పైగా క్యాండెట్స్‌ ఉంటే ఆ నియోజకవర్గంలో బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఒక్క ఈవీఎం 3,840 ఓట్లను స్టోర్‌ చేస్తుంది. ఈవీఎంలు హాక్‌ అవ్వవు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సిలికాన్‌ చిప్‌లో ఉంచేస్తారు.

►ఈవీఎంలు అక్కడక్కడా టాంపరింగ్‌ అవుతున్నాయని వార్తలు రావడంతో ఎలక్షన్‌ కమిషన్‌ ఓటరు– వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఓటరు బ్యాలెటింగ్‌ యూనిట్‌ బటన్‌ నొక్కగానే దేనికి ఓటు వేశాడో ఒక పేపర్‌పైనే ప్రింట్‌ అవుతుంది. ఇది కొన్ని సెకన్లు ఉండి వెళ్లిపోతుంది. ఓటరు సరిగ్గా ఓటు వేశాడో లేదో చూసుకోవచ్చు. వీవీప్యాట్‌లు సీజ్‌ చేసి ఉంటాయి. ఈవీఎం టాంపరింగ్‌ అయిందని అనుమానం వస్తే వీవీప్యాట్‌లో ప్రింట్‌ అయిన ఓట్లను బ్యాలెట్‌ పేపర్‌లాగా లెక్కిస్తారు.

►ఈవీఎంలను మన దేశానికి చెందిన రెండు కంపెనీలు తయారు చేస్తాయి. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) బెంగళూరు, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), హైదరాబాద్‌. ఈవీఎంలకు వాడే సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ అందులో పనిచేసే ఇంజినీర్లకు మాత్రమే తెలుసు. ఈవీఎంలలో మూడు మోడల్స్‌ ఉన్నాయి. 

►మొదటి మోడల్‌ను 1989–2006 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేశారు. దీనిని 2014 ఎన్నికల్లో చివరిగా వినియోగించారు. రెండో మోడల్‌ 2006 నుంచి 2012 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేశారు. మూడో మోడల్‌ 2013లో మ్యాన్‌ ఫ్యాక్చర్‌ చేయగా, ప్రస్తుతం దీనినే ఉపయోస్తున్నారు. ఇది ట్యాంపర్‌ ప్రూఫ్‌ మోడల్‌. ప్రతీ ఈవీఎం మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేసిన తరువాత రాజకీయ పార్టీల ఎదుట చెక్‌ చేస్తారు. పోలింగ్‌ అయిపోయిన తరువాత కంట్రోల్‌ యూనిట్‌లో ఉన్న క్లోజ్‌ బటన్‌ను ప్రెస్‌ చేస్తారు. దీంతో ఈవీఎం సీల్‌ అవుతుంది.

►ఒక్కసారి మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేసిన ఈవీఎంలను 15 సంవత్సరాల వరకు వినియోగిస్తారు. తరువాత ఈవీఎంలో చిప్స్‌ను ఎలక్షన్‌ ఆఫీసుకు అప్పగిస్తారు. 

మరిన్ని వార్తలు