Jagtial: మెస్సేజ్‌కి స్పందించలేదని మెమోలిచ్చిన ఎంపీడీవో

20 Sep, 2021 13:04 IST|Sakshi

ఎంపీడీవో తీరుపై మంత్రి కేటీఆర్, కలెక్టర్‌ రవికి నెటిజన్ల ఫిర్యాదు 

గొల్లపల్లి (బుగ్గారం): అత్యవసర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ  జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో తిరుపతి వాట్సాప్‌ గ్రూప్‌లో పంచాయతీ కార్యదర్శులకు చేసిన సందేశానికి స్పందన లేకపోవడంతో సదరు అధికారి వారికి మెమోలు జారీ చేశారు. బుగ్గారం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కోరుతూ మూడురోజుల క్రితం నీటి వినియోగం పనులకు సంబంధించిన ఫొటోలను పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్‌ గ్రూపులో పంపించారు. ఆ సందేశాన్ని గ్రూపులో ఉన్న 11 మంది చూసికూడా కనీసం స్పందించలేదు.

దీంతో ఉద్దేశపూర్వకంగానే తన సందేశానికి స్పందించలేదని భావించిన ఎంపీడీవో సెలవులో ఉన్న ఇద్దరిని మినహాయించి గ్రూపులోని 9మంది పంచాయతీ కార్యదర్శులకి వివరణ కోరుతూ మెమోలు జారీ చేశారు. ఈ విషయం ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో నెటిజన్లు ఎంపీడీవో తీరును తప్పుబడుతూ మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవికి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు