Karimnagar: మద్యం మత్తులో వార్డుబాయ్‌ హంగామా.. పెదవికి కుట్టేయమంటే కన్ను కింద కోశాడు

4 Aug, 2022 16:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: ఓ వ్యక్తి పెదవి పగిలి వైద్యం కోసం ఆసుపత్రికి రాగా.. మద్యం మత్తులో ఉన్న వార్డుబాయ్‌ పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోసిన దుర్ఘటన మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. వివరాల్లో కెళితే.. ప్రమాదంలో పెదవి పగిలిన వ్యక్తి కుట్లు వేయించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. సీవోటీలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్‌ కుట్లు వేయమని వార్డుబాయ్‌ను పురమాయించాడు.

అప్పటికే చిత్తుగా మద్యం సేవించి సీవోటీ వద్ద విధులు నిర్వహించే వార్డుబాయ్‌ పెదవికి కుట్లు వేయకుండా కన్ను కింది భాగంలో బ్లేడ్‌తో కోసి కొత్త గాయం చేశాడు. దీంతో పేషెంట్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్, నర్సులు పేషెంట్ల బంధువుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరగగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తున్నారని పేషెంట్‌ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే సదరు వార్డుబాయ్‌ గతంలో కూడా చాలాసార్లు మధ్య మత్తులో హల్‌ చేసిన ఘటనలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగానే సదరు వార్డుబాయ్‌ మద్యం మత్తును వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు. 
చదవండి: Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు

మరిన్ని వార్తలు