భార్య కాపురానికి రావడం లేదని..

31 Aug, 2020 10:38 IST|Sakshi
టవర్‌ ఎక్కిన యువకుడు

సాక్షి, మనూరు(నారాయణఖేడ్‌): భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తిలో ఆదివారం చోటు చేసుకుంది. నాగల్‌గిద్ద ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం ర్యాకల్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ అనే యువకుడు గత రెండేళ్ల క్రితం నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన పార్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఇరువురి మద్య మనస్పర్థలు రాడంతో భార్య పార్వతి తన తల్లిగారి ఇల్లు అయిన మోర్గికి వెళ్లింది. కాగా భార్యను తీసుకెళ్లెందుకు భర్త లక్ష్మణ్‌ రాగా భార్య నిరాకరించడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్‌ తనకు న్యాయం చేయాలని కరస్‌గుత్తిలోని ఓ సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. (పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త, అత్తమామలు)

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని హల్‌చల్‌ చేయడంతో స్థానికులు విషయం గమనించి నాగల్‌గిద్ద ఎస్‌ఐ సందీప్‌కు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ సదురు వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో యువకుడు టవర్‌ దిగి వచ్చాడు. అనంతరం యువకుడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని భార్య, కుటుంబీకులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

>
మరిన్ని వార్తలు