నాగోబా ఆలయ ఉద్ఘాటన షురూ 

13 Dec, 2022 04:41 IST|Sakshi
పూజల్లో పాల్గొన్న మెస్రం వంశీయులు

ఈనెల 18న శుద్ధి కార్యక్రమం 

తరలివచ్చిన మెస్రం వంశీయులు 

తొలిరోజు ప్రత్యేక పూజలు  

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో పునర్నిర్మించుకున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఆలయ పీఠాధి పతి మెస్రం వెంకట్‌రావ్‌ ఆధ్వర్యంలో ఈ వంశస్తులు దీప, నైవేద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆదివాసీ వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్‌ బాబ్డే గ్రామానికి చెందిన పురుషోత్తం, ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహారాజ్‌ కొడప వినాయక్‌రావ్‌ ఆధ్వర్యంలో నవగ్రహ పూజ నిర్వహించారు. 

ఆలయానికి చేరిన పవిత్ర జలం: ఈనెల 18న చేపట్టనున్న ఆలయ శుద్ధి కోసం ఐదు ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను గుడి వద్దకు తీసుకువచ్చారు. కెరమెరి మండలంలోని వజ్జకస్సా, జన్నారం మండలం వద్ద గోదావరి నదిలోని హస్తినమడుగు, గుడిహత్నూర్‌ మండలంలోని పులికహ్చర్, బేల మండలంలోని పెందల్‌వాడ, ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయం కోనేరు నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చినట్లు వెంకట్‌రావ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు