Osmania University: 8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత

6 Jan, 2022 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.

పీజీఈసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌
సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌ పీజీఈసెట్‌ ఈ నెల 6 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు సెట్‌ కన్వీనర్‌ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు.

‘డిగ్రీ వన్‌టైమ్‌ చాన్స్‌’ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్‌ చాన్స్, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్‌లాగ్, వన్‌టైమ్‌ చాన్స్‌ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్‌ శ్రీనగేశ్‌ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు)

పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ 
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్‌ జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్‌సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలన్నారు.  

ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్‌ఈఐఎస్‌) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్‌టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్‌ నికోలస్‌ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. 

మరిన్ని వార్తలు