వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే!

22 Feb, 2023 12:54 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కాగా హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు.

నిమ్స్‌కు తరలింపు
మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. సీనియర్‌ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్‌ తెలిపారు. శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్‌ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని  వెల్లడించారు. సీనియర్‌ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చదవండి: Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ

మరిన్ని వార్తలు