Photo Stories: మొక్కకూ క్యూఆర్‌ కోడ్‌ 

4 Jul, 2021 12:11 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కకు సంబంధించి వివరాలతో క్యూఆర్‌ కోడ్‌లను రూపొందించారు. ప్రతి మొక్క వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌లను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేస్తే మొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు తెలుసుకోవచ్చునని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. ఈ క్యూర్‌ కోడ్‌లను బాటనీ లెక్చరర్‌ సహకారంతో టీఎస్‌కేసీ మెంటార్‌ ఇమ్రాన్‌ రూపొందించారని చెప్పారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడు తా యన్నారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

బొగత పరవళ్లు 
బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఎగువన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌  సరిహద్దు దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తుతూ జలపాతంలో కలుస్తోంది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో గల ఈ జలపాతాన్ని వీక్షించేందుకు శనివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. – వాజేడు 

‘నీటి పిల్లుల’ హల్‌చల్‌ 
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి పిల్లులు సంచరిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. గతేడాది నుంచి కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో గోదావరిలో నీటి పిల్లులు అధికంగా వచ్చి చేరాయి. రాత్రి వేళ సంచరిస్తూ అవి చేపలను తింటూ జాలర్లు వేసిన వలలను కొరికి తెంపేస్తున్నాయి. దీంతో జాలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ పరిధి మండలపురం గ్రామానికి చెందిన జాలరి కొమ్మలి గోదావరిలో తరుచూ చేపలు పడుతున్నాడు. కాగా వలలను తెంపి పాడుచేస్తున్న రెండు నీటి పిల్లులను శుక్రవారం రాత్రి పట్టుకుని తర్వాత గోదావరికి దూరంగా అడవిలో వదిలేశాడు.

నేను గానీ వల వేస్తే.. 
వల విసరడమూ ఓ కళే. సరిగ్గా విసిరితేనే చేపలు చిక్కుతాయి. లేదంటే వల వేయలేక విలవిల్లాడాల్సిందే. శుక్రవారం కురిసిన వర్షానికి మంచిర్యాలలోని రాళ్లవాగులో వరద నీరు చేరింది. శనివారం చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉత్సాహం చూపారు. పోటీపడి వలలు విసురుతూ చేపలు పడుతున్న దృశ్యాన్ని 
‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.     – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల 

భారీ మీనం.. మత్స్యకారుడి ఆనందం 
నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ చెరువులో శనివారం ఓ జాలరికి 25 కిలోల చేప దొరికింది. చేప విలువ సుమారు రూ.5 వేలు ఉంటుందని జాలరీ గూండ్ల సాయిలు తెలిపారు.  – ఎడపల్లి(బోధన్‌) 

మరిన్ని వార్తలు