టైరును తెప్పలా చేసి.. గర్భిణిని వాగు దాటించి..

16 Sep, 2023 02:20 IST|Sakshi

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగా రం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద ఏటా వర్షాకాలంలో జంపన్నవాగు ప్రవాహంతో బానాజీబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతు న్నాయి. ఎలిశెట్టిపల్లికి చెందిన దబ్బకట్ల సునీత ఏడు నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

అక్కడే ఉన్న కొందరు గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో ట్రాక్టర్‌ వెనుక టైరును తెప్పలా మార్చారు. దానిపై గర్భిణిని కూర్చోబెట్టి వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి సాధారణమైన నొప్పులేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు