కొత్త సచివాలయ టెండర్‌ షాపూర్‌జీ– పల్లోంజీకి?

29 Oct, 2020 01:23 IST|Sakshi

ఎల్‌1 సంస్థ పేరు నేడు అధికారికంగా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్న సంస్థ పేరును గురువారం ప్రకటించనున్నారు. షాపూర్‌జీ– పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ .. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. రోడ్లు, భవనాల శాఖ టెక్నికల్‌ బిడ్లను తెరిచి రెండు సంస్థలూ సాంకేతిక అర్హత సాధించినట్టు వెల్లడించింది. తదుపరి ఫైనాన్షియల్‌ బిడ్లను తెరిచేందుకుగాను టెండర్‌ వివరాలను కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ)కు పంపారు. ప్రాజెక్టు వ్యయం (రూ.450 కోట్లకు పైగా) దృష్ట్యా టెండర్లను ఆమోదించే అధికారం రోడ్లు, భవనాల శాఖకు ఉండదు. ఫైనాన్షియల్‌ బిడ్లను తెరిచి ఎల్‌1ను సీఓటీ ప్రకటించనుంది. అధికారికంగా గురువారం ప్రకటించనున్నప్పటికీ, షాపూర్‌జీ–పల్లోంజీ సంస్థనే తక్కువ కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచిందన్న (టెండర్‌ దక్కించుకుందన్న) ప్రచారం అధికారవర్గాల్లో సాగుతోంది. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ప్రశ్నించగా, వివరాలను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. పది రోజుల్లో ఎల్‌1 సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలన్న విషయాన్ని అందులో పేర్కొంటారు.

మరిన్ని వార్తలు