మర్రిచెట్టుకు మళ్లీ ప్రాణం 

14 Feb, 2022 02:10 IST|Sakshi
చెట్టును లారీలో తరలిస్తున్న దృశ్యం 

ఎండిన చెట్టుకు జీవం పోశారు..

కోనరావుపేట(వేములవాడ): ఎండిన చెట్టుకు ప్రకృతి ప్రకాశ్‌ జీవం పోస్తే.. చిగురించిన మర్రిచెట్టును తరలించి పునరుజ్జీవం నింపారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల మర్రిచెట్టు వేళ్లతో సహా పడిపోయింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్‌ చెట్టుకు మూడు నెలలు నీళ్లు పోయడంతో చిగురించింది.

మర్రిచెట్టును తరలించేందుకు రూ.50 వేలకు పైగా అవసరం కావడంతో ప్రకాశ్‌ దాతల సహకారం కోరారు. విషయం తెలుసుకున్న సంతోష్‌కుమార్‌ చెట్టును తరలించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రెండు భారీ క్రేన్లను పంపించడంతో చిగురించిన మర్రిచెట్టును సుద్దాల నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ మర్రిచెట్టును సిరిసిల్ల కలెక్టరేట్‌లో నాటే పనులు కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు