ఖైరతాబాద్ (హైదరాబాద్): ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ ఏకాదశ రుద్ర మహాగణపతిగా దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ నామకరణం చేశారు. నిర్జల ఏకాదశి సందర్భంగా మహాగణపతికి సోమ వారం ఉత్సవ కమిటీ సభ్యులు నిరాడంబరంగా కర్రపూజ నిర్వహించారు. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 18 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనుకున్నా కరోనా సెకండ్ వేవ్తో ఖైరతాబాద్ మహాగణపతి తయారీపై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు అదుపులోకి రావడంతో మహాగణపతి తయారీకి కర్రపూజ నిర్వహించారు. అయితే ఈసారి మహాగణపతి ఎత్తు, నమూనాపై త్వరలో ప్రకటన చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. సెప్టెంబర్ 10న వినాయకచవితి ఉందని, 11 తలలతో నిలబడి ఉండే ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దనున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు.