అంగన్‌వాడీలకు చేనేత చీరలు

7 Jan, 2022 03:35 IST|Sakshi

ట్రాన్స్‌జెండర్లు తయారు చేసిన జనపనార సంచులు 

విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా చేనేత వస్త్రాలు ఇవ్వడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి, 30శాతం వేతన సవరణ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విభాగంపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ అన్నారు. ట్రాన్స్‌జెండర్లు తయారు చేసిన జనపనార బ్యాగులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు