రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ 

4 Sep, 2023 04:17 IST|Sakshi
ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న హెచ్‌ఆర్‌డీఏ సభ్యులు

17 ఏళ్ల తరువాత నిర్వహణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎమ్‌సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్‌ఆర్‌డీఏ విడుదల చేసింది.

అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 

48,405మంది డాక్టర్లకు ఓట్లు 
ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్‌ బాలెట్‌ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్‌ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్‌ తోటావర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు