నన్ను ఎందుకు పట్టించకోవడంలేదు.. వివాహేతర సంబంధం కారణంగా..

9 Jan, 2023 09:28 IST|Sakshi

మొయినాబాద్‌: కీడును శంకించిన ఓ మహిళ తన హత్యకు ముందు కూతురుకు ఫోన్‌ చేసింది. ఓయమ్మో.. నా మానం పాయే.. ప్రాణం పాయే.. నన్ను సంపుతుండే అంటూ భయాందోళనతో చెప్పిన మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మేస్త్రీ.. ఒంటరిగా ఉన్న సదరు మహిళను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆదివారం వెలుగుచూసింది. 

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన పులుకుంట లక్ష్మి (50), రాములు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్‌కు వచ్చారు. అద్దె గదిలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలమడక గ్రామానికి చెందిన హన్మంతు కొన్నేళ్లుగా మొయినాబాద్‌లో ఉంటూ మేస్త్రీ పని చేసేవాడు. మేస్త్రీ చేతి కింద పనికి వెళ్లిన లక్షి్మకి అతనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 

ఎనిమిది నెలల క్రితం లక్ష్మి భర్త రాములు మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన కొడుకుతో కలిసి సొంతూరు మల్లేపల్లికి వెళ్లి అక్కడే వ్యవసాయం చేసుకూంటూ జీవనం సాగిస్తోంది. పదిహేను రోజుల క్రితం కూలి పని కోసం మళ్లీ మొయినాబాద్‌కు వచ్చింది. అద్దె గదిలో ఉంటూ కూలి పని చేస్తోంది. విషయం తెలుసుకున్న హన్మంతు శనివారం రాత్రి ఆమె గదికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు తనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన హన్మంతు.. చీర కొంగుతో లక్ష్మి మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. కాగా, నిందితుడు హన్మంతును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు