భీమవరం (ప్రకాశంచౌక్): సమగ్ర కుల గణనను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో సమగ్ర కుల గణన సర్వే ఈనెల 27 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10లోపు పూర్తిచేయాల్సి ఉందని, ఈ మేరకు డిసెంబర్ 3లోపు పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. జిల్లాలోని వార్డు సచివాలయ సిబ్బంది 5,830 మందితో పాటు 9,600 మంది వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్తో కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర కుల గణన సర్వే చేయాలన్నారు. కుల గణన సమచారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదల కూడా మేలు జరుగుతుందన్నారు. జిల్లా వార్డు, గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, సీపీఓ కె.శ్రీనివాస రావు, డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి