వినాశకాలం వచ్చింది.. అందుకే విపరీత బుద్ధి

7 Jan, 2020 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు చంద్రబాబు, టీడీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తన స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే అవకాశవాది చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత ఆయనదని ధ్వజమెత్తారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) 

ప్రభుత్వంపై బురదజల్లేందుకు హింసను ప్రేరేపించే విధంగా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి మండిపడ్డారు. మొన్న మీడియాపై దాడి, నేడు పిన్నెల్లిపై దాడి రెండూ చంద్రబాబు కుట్రలో భాగమేఅన్నారు. తన ఆస్తులకు కాపాడుకునేందుకు చంద్రబాబు అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు వినాశకాలం వచ్చిందని, అందుకే విపరీత బుద్ధి పుట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు