‘ప్రమోషన్‌ కోసం ఠాకూర్‌ మమ్మల్ని ట్రాప్‌ చేశారు’

3 Nov, 2019 13:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెప్పు కోసం ఆర్పీ ఠాకూర్‌ తమను ట్రాప్‌ చేసి అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారని ఆయన వాపోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు మనస్తాపానికి గురై కొందరు ఉద్యోగులు ఆతహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని వెంకటేశ్వరావు అన్నారు.

మిగిలిన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలి..
3 ఏళ్లుగా అన్యాయనికి గురైన వారిలో కొందరికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏసీబీలో లోపాలను ఎత్తి చూపిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు. ఠాకూర్ కేసుల బాధితులందరికీ న్యాయం చేయాలి. విచారణకు వెళ్లేముందు కేసులు పునర్ పరిశీలించమని కోరుతున్నాము.
-బాధితుడు పయ్యావుల శ్రీనివాసరావు

మరిన్ని వార్తలు