విశాఖ ఎయిర్‌పోర్టులో అనౌన్స్‌మెంట్‌ బంద్‌

1 Aug, 2018 13:09 IST|Sakshi

శబ్దకాలుష్యం నియంత్రణకేనని అధికారుల వివరణ

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నుంచి ప్రయాణికులకు అనౌన్స్‌మెంట్‌ సిస్టంను బంద్‌ చేశారు. దిస్‌ ఈజ్‌ ఏ సైలెంట్‌ ఎయిర్‌పోర్ట్‌ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశీ య, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి అనూహ్యంగా పెరగడం, వరుసగా విమానాల రాకపోకలు సాగిస్తుండడంతో అనౌన్స్‌మెంట్‌ల ప్రక్రియను గతంలో పెంచారు. విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌లోనే కాదు. ఎదురుగా ఉన్న గార్డెన్‌లోనూ సౌండ్‌ హారన్‌లు ఏర్పాటు చేశారు. విమానాల రాకపోకల అనౌన్స్‌మెంట్‌ బస్‌స్టాండ్‌లో మాదిరిగా ఇక్కడా వినిపించేది.

అయితే తాజాగా విమానాశ్రయ అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విమానాల తాకిడి పెరగడంతో శబ్దకాలుష్యం పెరిగిందని చెబుతున్నారు.  ఇలా మంగళవారం నుంచి అనౌన్స్‌మెంట్‌ ప్రక్రియను నిలుపుదల చేశారు. ఇక్కడ డిస్‌ప్లే బోర్డులను గమనించి విమాన సర్వీసులు ఉపయోగించుకోవాలని డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి సూచించారు. ప్రయాణికులకు డిస్‌ప్లేబోర్డులతో పాటు వారి ఫోన్లకు ముందస్తు సమాచారాలను అనుసరించి విమాన సర్వీసులు వాడుకోవాలని కోరారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇలాంటి చర్యలు ఉన్నాయని చెప్పారు. అత్యవసరాల్లో మాత్రమే అనౌన్స్‌మెంట్‌లు జరుగుతాయని వివరించారు.

మరిన్ని వార్తలు