మా దారి మాదే!

13 Aug, 2014 02:59 IST|Sakshi

ఈఆర్‌సీ ఆదేశాలు బేఖాతర్ చేసిన ఏపీ సర్కారు.. కుట్ర దాగుందన్న అనుమానాలు
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) అమల్లో ఉన్నట్టేనన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తాజా ఆదేశాలపై ఏపీ సర్కారు మం డిపడుతోంది. ఏపీఈఆర్‌సీ ఉనికినే తాము గుర్తించడం లేదని, దాని ఆదేశాలను పాటించబోమని తేల్చి చెబుతోంది. ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఈఆర్‌సీ..  ఏకంగా విధాన నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని ప్రశ్నిస్తోంది. ఏపీ జెన్‌కో ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చేది లేదని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ఈఆర్ సీ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు తెలిపా యి. ఏపీఈఆర్‌సీ తాజా ఆదేశాలపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొన్నటివరకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్న ఈఆర్‌సీ.. అత్యవసరంగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి.
 
 అప్పుడు చెప్పలేదేం?: పీపీఏలను రద్దు చేసుకుంటామని ఏపీ జెన్‌కో దరఖాస్తు చేసుకున్న సమయంలో కానీ, పీపీఏలు ఉన్నాయా.. లేదా? అని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అడిగినప్పుడు కానీ... ఎందుకు సమాధానం చెప్పలేదని ఏపీఈఆర్‌సీపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. అసలు సీఈఏ కమిటీ సమావేశాలకే రాని ఏపీఈఆర్‌సీకి దాని నివేదిక ఆలస్యమవుతుందని ఎలా తెలిసిందని, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తోంది. విభజన చట్టంలో  ఏపీఈఆర్‌సీ తమకే దక్కుతుందని ఎక్కడా పేర్కొనలేదని ఏపీ వర్గాలు అంటున్నాయి. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే మినహా ప్రస్తుత ఏపీఈఆర్‌సీ.. మరో నాలుగు నెలల తర్వాత.. అంటే వచ్చే జనవరి 2 తర్వాత రద్దవుతుందని వాదిస్తున్నాయి.  
 
 సీఈఏ కమిటీ దృష్టికి ఈఆర్‌సీ నిర్ణయం!
 మరోవైపు ఏపీఈఆర్‌సీ జారీ చేసిన తాజా ఆదేశాలను సీఈఏ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోం ది. పీపీఏలకు ఈఆర్‌సీ అనుమతి లేకపోయినప్పటికీ చెల్లుబాటులో ఉన్నట్టేనన్న ఈఆర్‌సీ నిర్ణయాన్ని కమిటీ దృష్టికి తేవ డం ద్వారా.. తెలంగాణకు సానుకూలంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని రాష్ర్ట ఇంధన శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  విద్యుత్ వివాదాలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గురువారమే(ఈ నెల 14న) సీఈఏ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదికకు ముందుగానే ఈఆర్‌సీ ఆదేశాలు జారీకావడం తమకు కలిసొచ్చే అంశమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు