‘ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్‌ నిర్వహిస్తాం’

12 Oct, 2019 11:39 IST|Sakshi

సాక్షి, విశాఖ : రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ను క్రీడల, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలోని స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విశాఖను స్పోర్ట్స్‌ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలోని అగనంపూడిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్‌ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.  

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు, అన్ని సదుపాయాలతో ప్రతి జిల్లాలో స్పర్ట్స్‌కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు జరగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో  జపాన్‌ దేశపు ప్రతినిధులు, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు