సాక్షి, న్యూఢిల్లీ: కోడి పందేలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత కనుమూరు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం విచారించింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొనగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అనూప్ చౌదరి స్పందిస్తూ కోళ్లను అదుపులోకి తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని విన్నవించారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ అంశం స్పష్టంగా ఉందని వివరించారు. అయితే ఈ అంశంపై హైకోర్టునే సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. సంబంధిత ఉత్తర్వులు లిఖితపూర్వకంగా వెలువడాల్సి ఉంది.