సాక్షి, వైఎస్సార్ కడప: రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కె.రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ 2015లోనే తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మానేసి ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విజయవాడలో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై అన్ని సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలిసేలా ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. కడపలో సోమవారం జరిగిన 26వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక అనంతరం పలు ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు చర్చించారు.