వైద్యానికి సుస్తీ

18 Nov, 2014 01:14 IST|Sakshi

 ఏలూరు : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లల్లో సౌకర్యాలేమి రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఏళ్ల తరబడి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పూజ్యంగా మారింది. 48 మండలాల్లో 79 పీహెచ్‌సీలుండగా, 158 మంది వైద్యులున్నారు. తొమ్మిది సీహెచ్‌సీల్లో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు. అదనపు పోస్టుల మంజూరు లేక డిప్యూటేషన్‌పైనే స్థానికంగా ఉన్న పీహెచ్‌సీ వైద్యులు సేవలందిస్తున్నారు. టె క్నీషియన్, నర్సుల పోస్టులు 60కు పైగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల రోగుల పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. మందుల కొరత, వివిధ రోగాల నిర్ధారణకు ల్యాబ్‌లు లేకపోవడంతో వైద్యం అందడం లేదు. డాక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతుండడంతో రోగులు ఆర్‌ఎంపీ, ఇతర వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పీహెచ్‌సీల్లోను ప్రసవాలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకావడం లేదు. జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను ‘సాక్షి’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి.
 
 సకాలంలో రాని డాక్టర్లు
 చింతలపూడి పీహెచ్‌సీలో డాక్టర్ రాకపోవడంతో స్టాఫ్ నర్సు, ఆరోగ్యమిత్ర కార్యకర్తలు రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. ఇరగవరం పీెహ చ్‌సీ వైద్యుడు సెలవులో ఉండగా ఇన్‌చార్జి డాక్టరు సౌజన్య 11 గంటలకు వచ్చారు. ఉండ్రాజవరం పీహెచ్‌సీలో వైద్యుడు సెలవులో ఉన్నారు. స్టాఫ్ నర్సే ఓపీ నిర్వహించారు. టి నర్సాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎం.నాగేశ్వరరావు 10.30 గంటలకు విధులకు హాజరయ్యారు. లింగపాలెం పీహెచ్‌సీ డాక్టర్ డిప్యుటేషన్‌పై ఏలూరు వెళ్లడంతో నర్సులు రోగులను పరీక్షించారు. బుట్టాయగూడెం ఆసుపత్రిలో ఉదయం సమయంలో వైద్యాధికారి ఒక్కరే ఉండడంతో రోగులు బారులు తీరుతున్నారు. దెందులూరు పీహెచ్‌సీలో ఆరుగురు వైద్యులుసాయంత్రం విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆచంట సీహెచ్‌సీలో సోమవారం ఆరుగురు వైద్యాధికారులకు ఒక్కరే సేవలు అందించారు. ఇక్కడ గైనకాలజిస్టు, ఎనస్తీషియన్ లేకపోవడంతో ప్రసవాలు జరగడం లేదు.
 
 సిబ్బంది, పరికరాల కొరతే అవరోధం
  ఏలూరు మండలం గుడివాకలంక పీహెచ్‌సీకి ప్రహరీ లేక పశువుల విశ్రాంతి నిలయంగా మారింది. కొయ్యలగూడెంలో సిబ్బంది పోస్టులు ఏళ్లతరబడి భర్తీ కావాల్సి ఉంది. భీమవరం మండలం గొల్లవానితిప్ప పీహెచ్‌సీలో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు సౌకర్యాలు లేవు. కొయ్యలగూడెంలో యుజీపీహెచ్‌సీలో జనరేటర్ లేక విద్యుత్ కోతల వేళల్లో తల్లులు చంటిపిల్లలను చెట్లరే ఊయలలు కట్టి ఆడిస్తున్నారు. చింతలపూడి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ పని చేయడం లేదు.
 
 వసతుల్లేని భవనాలు
 అత్తిలి పీహెచ్‌సీ భవనం ఇరుకుగా ఉండడంతో రోగులు ఆరుబయటే కూర్చుంటున్నారు. గోపాలపురం 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్టు, సిబ్బంది కొరత వేధిస్తోంది. లంకలకోడేరు పీహెచ్‌సీలో ఆపరేషన్ థియేటర్ శ్లాబు పాడై వర్షం నీరు లోపలికి వస్తోంది.
 

మరిన్ని వార్తలు