పత్తి రైతులకు సీసీఐ ఆన్‌లైన్ చెల్లింపులు | Sakshi
Sakshi News home page

పత్తి రైతులకు సీసీఐ ఆన్‌లైన్ చెల్లింపులు

Published Tue, Nov 18 2014 1:11 AM

cci online oayments for cotton farmers

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో శ్రీకారం

సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు ఊరట కలిగించే అంశం ఇది. ఇప్పటి వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి అమ్మకాలు చేసిన రైతులకు పదిహేను రోజుల నుంచి నెల రోజుల మధ్య నగదు చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు వెంటనే రైతులకు నగదు చెల్లించేందుకు సీసీఐ ముందుకు వచ్చింది. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లోకి గిట్టుబాటు ధర సొమ్మును జమచేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు సీసీఐ అంగీకరించిందని వ్యవసాయశాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇటీవల సీసీఐ ఎండీ సి.కె.మిశ్రా హైదరాబాద్ వచ్చి వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందులో ఆన్‌లైన్ చెల్లింపుల అంశం చర్చకు వచ్చింది. వెంటనే ఆయన ఢిల్లీ నుంచి సీసీఐ డెరైక్టర్ చొక్కలింగం ఆధ్వర్యంలోని బృందాన్ని రాష్ట్రానికి పంపించారు. సోమవారం ఈ బృందం వరంగల్ మార్కెట్‌ను సందర్శించింది.

రాష్ట్ర వ్యవసాయశాఖ విజ్ఞప్తి మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆన్‌లైన్‌లో పత్తి రైతుల బ్యాంకు ఖాతాలోకి నగదు చెల్లింపులు చేయాలని సీసీఐ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టి మున్ముందు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 78 సీసీఐ కేంద్రాలకు గాను ఇప్పటివరకు 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement