అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

28 Jul, 2015 19:38 IST|Sakshi

ఆదోని టౌన్ : కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని కపటి నాగలాపురం గ్రామానికి చెందిన రైతు ధనుంజయ(36) అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాలూకా ఎస్‌ఐ నీలకంఠేశ్వర్ తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయకు భార్య సుభద్రమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటరాముడు బధిరులు. రెండున్నర ఎకరాల పొలం సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బోరు బావి ఉన్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆరు బోర్లు వేయించాడు. నీళ్లు పడకపోవడం, పదేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో దాదాపు రూ.8లక్షలు అప్పు చేశాడు.

కాగా ఇటీవల రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన భార్య స్థానికుల సహాయంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు