కొలిక్కి వచ్చిన బంగారం చోరీకేసు

25 Apr, 2015 02:43 IST|Sakshi

యైటింక్లయిన్‌కాలనీ : గోదావరిఖని టూటౌన్‌పోలీస్‌స్టేషన్ పరిధి సెంటినరీకాలనీలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసు ఓకొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఈనెల 22న వేకువజామున సెంటినరీకాలనీలోని  ఉప్పుల కనకాచారికి చెందిన శ్రీరామ నగల దుకాణంలో చోరీ జరిగింది. షాప్ వెనక తలుపు పగులగొట్టి ఆభరణాలు, అప్పుకాగితాలున్న లాకర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈలాకర్‌లో కిలో బంగారం, ఆరుకిలోల వెండి, రూ. 7లక్షలు ఉన్నట్లు బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
  గోదావరిఖని డీఎస్పీ మల్లారెడ్డి, టూటౌన్ సీఐ క్రిష్ణ, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ వెంటనే రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించారు. పరిచయం ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈమేరకు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్ రప్పించి తనిఖీ చేపట్టారు. కొన్ని కీలక ఆధారాలను సేకరించి విచారణ వేగవంతం చేశారు. ఈక్రమంలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. మండలంలోని ఆదివారం పేటకు చెందిన నలుగురితో పాటు సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన మరోఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా అనుమానించారు. గ్రామ శివారులోని పొల్లాల్లో లాకర్‌ను తీసుకెళ్లి పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని లాకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
 
 24గంటల్లోపే చోరీకేసు ఛేదన..
 చోరీ జరిగిన 24గంటల్లోపే నిందితుల వివరాలు, లాకర్ గురించి పోలీసులు వివరాలు సేకరించారు. సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి చోరీని సీరియస్‌గా తీసుకున్నారు. కొద్దిరోజులుగా షాపు వద్ద అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి విచారణ జరిపారు.
 
 దీంతో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బంగారాన్ని కుదువ పెట్టి అప్పులు తీసుకున్న  వ్యక్తులపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఆదివారంపేటకు చెందిన నలుగురు, సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది. అయితే బాధితుడు ఫిర్యాదు చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో బంగారు, వెండి ఆభరాణాలతో పాటు అప్పు పత్రాలు కూడా లాకర్‌లో ఉన్నట్లుగా సమాచారం. మరికొద్దిరోజులైతే కేసు పీఠముడి విడిపోనుంది.
 

మరిన్ని వార్తలు