హార్సిలీహిల్స్ భూమి లీజుకు గ్రీన్ సిగ్నల్ !

8 Jun, 2014 01:56 IST|Sakshi
  •      మూడెకరాలు పర్యాటక శాఖకు అప్పగించిన రెవెన్యూ           
  •      ఎకరా విలువ రూ.40 లక్షల నుంచి రూ.6.6లక్షలకు కుదింపు
  •      {పారంభం కానున్న ప్రయివేటు కార్యకలాపాలు
  • బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఓ ప్రయివేటు సంస్థ హార్సిలీహిల్స్‌లో నిర్వహించతలపెట్టిన అడ్వంచర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణం కోసం భూమి లీజు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వె లువడిన క్రమంలో శుక్రవారం బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు ఆ భూమిని పర్యాటకశాఖకు అప్పగిం చారు.

    ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను జాయిం ట్ కలెక్టర్‌కు అందజేశారు. హార్సిలీహిల్స్‌లో తొలి సారిగా ఇక ప్రయివేటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఏకైక వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ ప్రసిద్ధిచెందింది. అక్కడ సాహస విన్యాసాల ప్రాంగణం ఏర్పాటు కోసం ఓ సంస్థకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన మూడెకరాల స్థలాన్ని 2005లో ప్రభుత్వం కేటాయిం చేందుకు అనుమతినిచ్చింది. అప్పట్లో స్థలం స్వాధీనం చేసుకునే విషయంలో సంస్థ జాప్యం చేసింది.

    రెండేళ్లుగా దీనిపై దృష్టిపెట్టింది. స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై పూర్వ కలెక్టర్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఆ భూమికి విలువ నిర్ధారించే విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. చివరకు ప్రస్తుత కలెక్టర్ దీనిపై చర్యలు చేపట్టారు. భూమి అప్పగింతకు సంబంధించిన నివేదిక కలెక్టర్‌కు చేరగా, దాన్ని సీసీఎల్‌ఏకు పంపారు.

    అక్కడి నుంచి మార్చి 21న అనుమతులు మంజూరు కావడంతో బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొండజింకల పార్కు సమీపంలో సర్వే నంబర్ 592/1లోని 3 ఎకరాల భూమిని కేటాయించాలని నిశ్చయించారు.

    ఆ భూమిని రెవెన్యూ శాఖ నుంచి పర్యాటకశాఖకు బదిలీచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని పర్యాటకశాఖ అధికారులు లీజుదారులకు అప్పగించనున్నారు. దీనిపై శుక్రవారం జిల్లా పర్యాటకశాఖ అధికారి డీ.చంద్రమౌళిరెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ భూమిని తమకు అప్పగించార ని, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక భూమి అప్పగిస్తామని చెప్పారు.
     
    రూ.40 లక్షల నుంచి రూ.6.6 లక్షలకు

    హార్సిలీహిల్స్‌లోని భూమికి విలువను నిర్ణయించడంలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి భూమికి విలువకట్టలేం. అయితే ప్రయివేటు సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన భూమికి విలువ కట్టాల్సివచ్చింది. దీంతో తొలుత ఇక్కడ ఎకరా భూమికి ఏడాదికి రూ.5.5 లక్షలుగా నిర్ణయిం చి నివేదిక పంపారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కు పంపారు. తర్వా త ఎకరా విలువను రూ.40 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై కూడా అభ్యంతరాలొచ్చాయి. చివరకు ఎకరా కు రూ.6.6 లక్షలు చొప్పున మూడెకరాలకు రూ.19.8 లక్షలుగా నిర్ణయించారు.  
     
    వచ్చేది మొక్కుబడి లీజు
     
    కొండపై పట్టుపరిశ్రమశాఖ భవనాల సమీపంలోని 3 ఎకరాలు లీజుకు అప్పగిస్తే ఏడాదికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆ భూమికి నిర్ణయించిన విలువలో 5 శాతమే. 3 ఎకరాల విలువ రూ.19.8లక్షలు. అంటే తొలిసంవత్సరం సంస్థ ప్రభుత్వానికి చెల్లించే లీజు రూ.99వేలు. రెండో ఏడాది ఈ మొత్తానికి అదనంగా మరో ఐదు శాతం కలిపి చెల్లిస్తారు. మూడో ఏడాది అభివృద్ధి రుసుము, లీజు మొత్తం కలిపితే రూ.2 లక్షలు ప్రభుత్వానికి అందుతుంది. ఇలా ఏడాదికేడాది పెరుగుతూ ఉంటుంది.

మరిన్ని వార్తలు