చంద్రబాబు నాయుడి లాంటి నాయకుడు ఒక్కరుంటే.. మన దేశానికి స్వాతంత్ర్యం కూడా వచ్చి ఉండేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తనను బలవంతంగా విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు ఆయన అడ్డు తగులుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జల్లికట్టు కోసం తమిళ ప్రజలు కలిసికట్టుగా ఉన్నతీరు తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే..
-
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగాను, విశాఖపట్నంలోను జరిగిన ఘటనలను యావత్ రాష్ట్రం చూసింది
-
చేసిన అన్యాయమైన పనికి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
-
ప్రత్యేకహోదా కావాలని రాష్ట్రంలోని ప్రతి యువకుడు ఉద్యమించారు
-
చంద్రబాబు పుణ్యాన ఉద్యోగాలు దొరక్క, రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది
-
రాష్ట్రంలో లక్షా ఆరువేల వరకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఉంటే, వాటిలో 26వేల పరిశ్రమలు మూతపడుతున్నాయని కేపీఎంజీ లాంటి సంస్థలు నివేదికలు ఇచ్చాయి
-
పిల్లలకు మళ్లీ ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవని అని తెలిసి కూడా దగ్గరుండి చంద్రబాబు ప్రత్యేక హోదా అన్నమాట ఎవరి నోటి నుంచి వచ్చినా, హోదా కోసం ఎవరు పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణిచేసే వైఖరిని అవలంబించారు
-
ముఖ్యమంత్రిగా ఉండి పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి.. ప్రత్యేక హోదా అన్న హామీని దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తున్నారు
-
ఇలాంటి ముఖ్యమంత్రి మనకున్నాడని అందరం బాధపడాల్సిన సమయం ఇది
-
దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లయిన ఈరోజు.. స్వాతంత్ర్యాన్ని ఖూనీ చేశారు.
-
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయడానికి ప్రయత్నిస్తే, కాకినాడలోజేఎన్టీయూ పిల్లలను కొట్టారు.
-
తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం అన్నిచోట్లా పిల్లలను కొట్టడం, కేసులు పెట్టారు, వేలమందిని అరెస్టు చేశారు
-
వైఎస్ఆర్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు, స్టేషన్లోకి తరలించడం, జీపుల్లో తీసుకుపోవడం, సీపీఎం మధు లాంటి సీనియర్లను శ్రీకాకుళంలో దారుణంగా అరెస్టు చేయడం.. ఇవన్నీ చంద్రబాబు చేయాల్సిన పనేనా
-
విశాఖపట్నం విమానాశ్రయంలో మేం విమానం దిగిన వెంటనే రన్వే మీదనే ఏకంగా పోలీసులంతా కలిసి వచ్చారు
-
అక్కడ మేం ఐదారుగురం దిగాం.. వెంటనే వందలకొద్దీ పోలీసులతో ఎయిర్పోర్టులోకి కూడా రానివ్వకుండా రన్వే మీదనే ఆపారు
-
ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరు ఎంపీలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం పక్కన పెట్టినా.. సామాన్య ప్రయాణికులకు డొమెస్టిక్ ఎరైవల్ గేటులోంచి వెళ్లే హక్కుంటుంది
-
రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు ఎయిర్పోర్టులో అధికారం లేదు, అది కేంద్రప్రభుత్వ పరిధిలోనిది
-
అలాంటిది రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మోహరించడం, అక్కడ హక్కు లేకపోయినా రావడం, ప్రయాణికులుగా ఉన్న మమ్మల్ని కనీసం ఎయిర్పోర్టులోకి కూడా రానివ్వకుండా అడ్డుపడ్డారు
-
డొమెస్టిక్ ఎరైవల్ గేటు వద్ద రెండు గంటలు ధర్నాకు కూర్చోవాల్సి వచ్చింది
-
చంద్రబాబు సర్కారుకు, ఆయన వద్ద పనిచేస్తున్న కొంతమంది పోలీసులకు చెబుతున్నా
-
జీతాలిచ్చేది చంద్రబాబు కాదు, ప్రభుత్వం
-
సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు గానీ గుంటనక్కలకు కాదు
-
ఎల్లకాలం చంద్రబాబు సర్కారు సాగదు..దయచేసి ప్రజల పక్షాన, వారికి అండగా నిలబడండి
-
ఇదే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పిల్లలు, నాయకులు అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు
-
ఇపుడున్న పోలీసుల పిల్లల భవిష్యత్తు కూడా అందులో ఉంటుంది
-
కొంతమంది పోలీసులు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా, చాలా దారుణంగా ప్రవర్తించారు
-
ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు నిజంగా వీటన్నింటి మీద విచారణ జరుగుతుంది.
-
బాధ్యులు, దోషులు అందరిమీదా చర్యలు తీసుకుంటాం, తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతాం
-
చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా వారిమీద కేసులు పెట్టారు
-
ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటూ భరోసా ఇస్తున్నా.. కేసులకు ఎవరూ భయపడొద్దు
-
చంద్రబాబు ప్రభుత్వం ఉండేది రెండేళ్లు. దేవుడు దయతలిస్తే ఏడాదిలోనే పోతుంది
-
పెట్టిన ప్రతికేసు మన ప్రభుత్వం వచ్చాక తీసేస్తాం
-
చంద్రబాబు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రత్యేక హోదాను ఖూనీచేయడాన్ని దేవుడు, ప్రజలు కూడా క్షమించరు
-
ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది
-
చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు ఆయన అడ్డు తగులుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాలని కోరుతున్నా
-
ప్రత్యేక హోదా మన శ్వాస.. దానికోసం పోరాటం చేయకపోతే అది చంద్రబాబు దగ్గరుండి మర్చిపోయేలా చేస్తారు
-
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకిస్తామని చెప్పిన హామీ అది
-
దాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని చెప్పాలి
-
అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం
-
చంద్రబాబు లాంటి వ్యక్తిని గట్టిగా ఎదుర్కొందాం, బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తెద్దాం
-
తమిళనాడులో జరిగిన జల్లికట్టుకు, దీనికి సంబంధం ఏముందని చంద్రబాబు, ఆయన మంత్రుల వెటకారంగా మాట్లాడతారు
-
జల్లికట్టుతో సంబంధం ఉందో లేదో చెప్పను గానీ, దాంతో వచ్చిన కలసికట్టుకు మేమంతా ముగ్ధులమయ్యాం
-
అన్ని పార్టీలను ముఖ్యమంత్రి తీసుకెళ్లి, సుప్రీంకోర్టువ్యతిరేకించినా సాధించుకున్నారు
-
సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, అది మాకు స్ఫూర్తి
-
చంద్రబాబు లాంటి ఒక నాయకుడు ఉంటే.. బహుశా మనకు స్వాతంత్ర్యం కూడా వచ్చి ఉండేది కాదు
-
జాబు రావాలంటే బాబు పోవాలని చెబుతున్నా
-
చంద్రబాబు, సుజనా చౌదరి మాటలు వింటుంటే నిజంగా వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది