కుమార్తెను రమ్మని చెప్పి వస్తుండగా...

22 Apr, 2016 23:38 IST|Sakshi

తల్లి మృతి...
కొత్తూరు : వేసవి సెలవులతో పాటు గ్రామంలో బంధువుల వివాహానికి పాఠశాలలో చదువుతున్న కుమార్తెను ఇంటికి పిలిచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వివాహిత దుర్మరణం పాలైంది. భర్త మిన్నారావు, బంధువులు, పోలీసులు చెప్పిన వివరాలు...భామిని మండలం అత్తికొత్తూరుకు చెందిన తందాడ రమణమ్మ(35) పాతపట్నంలో చదువుతున్న తన కుమార్తె లావణ్యను ఇంటికి తీసుకువచ్చేందుకు అక్కడి వసతిగృహానికి శుక్రవారం వెళ్లింది. అక్కడి అధికారులు శనివారం పంపిస్తామని చెప్పడంతో రమణమ్మ తిరుగు ప్రయాణమైంది.

మార్గమధ్యలో రమణమ్మ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా ఇంటికి వస్తానని చెప్పడంతో ఆ యువకులు ఆమెను కూడా బైక్‌పై ఎక్కించారు. బైక్‌పై వస్తుండగా బంకి గ్రామ సమీపంలో బైక్ పైనుంచి రమణమ్మ జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారిణి సునీత తెలిపారు. రమణమ్మకు భర్త మిన్నారావు, కుమార్తె లావణ్య, కుమారుడు సోమేశ్వరరావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుట హెచ్‌సీ సింహాచలం తెలిపారు.

మరిన్ని వార్తలు