అమ్మాయిలదే హవా | Sakshi
Sakshi News home page

అమ్మాయిలదే హవా

Published Fri, Apr 22 2016 11:10 PM

అమ్మాయిలదే హవా

మొదటి సంవత్సరం..  ఫలితాలు పునరావృతం
ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌కు మూడో స్థానం
రంగారెడ్డికి తొలిస్థానం...

 

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలు అదరగొట్టారు. జంట జిల్లాల్లో బాలురపై వారే పైచేయి సాధించారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో.. గతేడాది మాదిరిగానే బాలికలు మెరుగ్గా రాణించారు. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా 56 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ఇక 69 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో రంగారెడ్డి 76 శాతం ఉత్తీర్ణతతో మరోసారి ప్రథమ స్థానం పొందింది. హైదరాబాద్ జిల్లా ఒక అడుగు వెనక్కి వేసి 63 శాతంతో మూడో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరంలో బాలికలు 65 శాతం,  ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72 శాతం, రంగారెడ్డిలో ప్రథమలో 73 శాతం, ద్వితీయలో 79 శాతం ఉత్తీర్ణులయ్యారు.          

                              

సిటీబ్యూరో: జంట జిల్లాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో గతేడాది ఫలితాలే పునరావృతమయ్యాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్రస్థాయిలో వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రెండు జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ.. ముందు వరుసలో నిలబడడం శుభపరిణామం. హైదరాబాద్ జిల్లాలో 64,793 మందికి గాను 35,999 మంది (56 శాతం) విద్యార్థులు విజయం సాధించారు. ఒకేషనల్‌లో 3,232 విద్యార్థులకు 1,632 (50 శాతం) మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 1,08,624 విద్యార్థులు పరీక్షలు రాయగా 74,453 (69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 2,625కు.. 1,352 మంది ఉత్తీర్ణులయ్యారు.

 
బాలికల ప్రభంజనం..

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రెండు జిల్లాల్లోనూ బాలికలు మెరుగ్గా రాణించారు. హైదరాబాద్ జిల్లాలో బాలికలు 65 శాతం, బాలురు 46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో అమ్మాయిలు 68 శాతం, అబ్బాయిలు 36 శాతం నెగ్గారు. రంగారెడ్డి జిల్లాలో బాలికలు 73 శాతం, బాలురు 65 శాతం పాసయ్యారు. ఒకేషనల్‌లో బాలికలు 61 శాతం, బాలురు 45 శాతం ఉత్తీర్ణులయ్యారు.

 

ప్రభుత్వ కళాశాలల్లో నిరుత్సాహమే..

రెండు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నామమాత్రంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. హైదరాబాద్‌లో 33 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.72 శాతం విద్యార్థులే గట్టెక్కారు. హైదరాబాద్ జిల్లాలో 4,304 మందికి గాను. 1,416 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఏఎం ప్రభుత్వ బాలికల కళాశాలలో అధికంగా 54 మంది విద్యార్థులు నెగ్గారు. ఆ తర్వాతి స్థానాల్లో 45 శాతంతో హుస్సేనీ ఆలం, మైసారంలోని ప్రభు త్వ బాలికల కళాశాలలు నిలిచాయి. నాంపల్లిలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో అతితక్కువగా 12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో గల కూకట్‌పల్లిలోని న్యూ గవర్నమెంట్ కళాశాలలో గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అతి తక్కువగా కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో 59 శాతం, ఎయిడెడ్ కళాశాలల్లో 35 శాతం, రెసిడె న్షియల్ జూనియర్ కళాశాలలో 63 శాతం, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజ్‌లో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Advertisement
Advertisement