ముద్దు బిడ్డలు మాంసపు ముద్దలయ్యారు

28 Jun, 2014 04:36 IST|Sakshi
ముద్దు బిడ్డలు మాంసపు ముద్దలయ్యారు

నగరం: అగ్నికీలలు చుట్టుముట్టాయి.. ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. తనను హత్తుకొని నిద్రిస్తున్న ఇద్దరు ముద్దు బిడ్డలను రక్షించుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించలేదు. బిడ్డలతోపాటు ఆమెను కూడా మృత్యువు కబళించింది. చుట్టపుచూపుగా వచ్చిన ఆమె మరిది, తోడికోడలు కూడా సజీవదహనమయ్యారు. గెయిల్ గ్యాస్ పైపు దుర్ఘటనలో గటిగంటి వాసు కుటుంబం విషాదమిది.

216 జాతీయ రహదారి సమీపంలో వాసు కుటుంబం హోటల్ నడుపుకొంటోంది. శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైపు పేలుడుతో సంభవించిన మంటలు వాసు ఇంటిని కూడా చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో తెలిసేలోపే వాసు భార్య అనంతలక్ష్మిని, ఆమెను హత్తుకుని నిద్రిస్తున్న పిల్లలు సుజాత (6), సాయి గణేష్ (4) లతోపాటు ముందురోజే వచ్చిన వాసు తమ్ముడు మధు (35), మరదలు కోకిల (33)ను కబళించాయి. క్షణాల్లోనే ఐదుగురూ మసైపోయారు. బిడ్డలను రక్షించేందుకు అనంతలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైనట్లు మృతదేహాలు పడి ఉన్న తీరు చెబుతోంది. కాగా వాసు ఆచూకీ తెలియరాలేదు.
 

మరిన్ని వార్తలు