-
ఎంత ఘోరం తప్పింది..
మలికిపురం : దేశ చమురు సంస్థల చరిత్రలోనే నెత్తుటి ఘట్టంగా.. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో 20 మందిని పైగా బలిగొన్న గెయిల్ పైపులైన్ విస్ఫోటపు గురుతులు ఇంకా జిల్లాను ఉలికిపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. కలుగుల్లోని పాముల్లా.. పచ్చని కోనసీమ కడుపులా దాగిన చమురు, సహజవాయు పైపులైన్లు ఇంకెక్కడ, ఇంకెంత ఉత్పాతాన్ని సృష్టిస్తాయోనన్న భయం.. నగరంలో గత 27 వేకువన అభాగ్యులను తరిమిన అగ్నికీలల్లా.. ఆ సీమవాసులను వెన్నాడుతూనే ఉంది. అయినా.. మృత్యువు చేసిన పెనుహెచ్చరికలాంటి ఆ దుర్ఘటన నుంచి చమురు సంస్థలు పాఠాలు నేర్చుకోలేదు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీకి చెందిన గ్రూప్ గేదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ప్రహరీకి చేర్చి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సోమవారం పేలి, మంటలు చెలరేగాయి. అయితే.. అదృష్టవశాత్తు మహావిపత్తు తప్పింది. జీజీఎస్కు చమురును తీసుకువెళ్లే పైపులైన్ల చుట్టూ మంటలు వ్యాపించినా, జీజీఎస్లో లక్షలాది లీటర్ల ముడిచమురుతో నిండిన భారీ ట్యాంకుకు చేరువలోనే ఈ దుర్ఘటన జరిగినా ..ఎలాంటి ముప్పూ లేకుండానే ప్రమాదం సమసిపోయింది. ఒక పీచు ఫ్యాక్టరీకి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ జీజీఎస్ ప్రహరీకి చేర్చి ఉంది. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగి ట్రాన్స్ ఫార్మర్పై పడ్డాయి. దాంతో అది పేలి మంటలు మరింత విజృంభించాయి. పక్కనే ఉన్న పీచు ఫ్యాక్టరీలోని పీచూ తగలబడింది. అన్నింటికీ మించి.. జీజీఎస్కు ముడిచమురును తీసుకు వెళ్లే పైపులైన్ల చుట్టూ పోగుపడ్డ చెత్త, ఎండుగడ్డి అంటుకోవడంతో అవి కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ పైపు లైన్లు అటు బావులకు, ఇటు చమురు నిల్వ చేసే ట్యాంకులకు అనుసంధానమై ఉంటాయి. అయితే పైపులైన్ల చుట్టూ వ్యాపించిన మంటలు, ఎలాంటి ఉత్పాతం జరగక ముందే ఆరిపోయాయి. ఈలోగా స్థానికులు ప్రాణాలు అరచేత పెట్టుకున్నట్టు బిక్కుబిక్కుమన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పైపులైన్లు పేలి, నగరం దారుణం లాంటిది జరుగుతుందో లేక మంటలు ముడిచమురు నిల్వ ఉన్న ట్యాంకులకూ సోకి అంతకు ఎన్నోరెట్ల ఘోరం సంభవిస్తుందోనని నిలువునా వణికిపోయారు. అలాంటివేమీ జరగకుండానే ప్రమాదం సమసిపోవడంతో ‘బతుకుజీవుడా’ అని ఊపిరి పీల్చుకున్నారు. కాగా తాటిపాక, నర్సాపురంల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేయడానికి కృషి చేశాయి. కాగా ఈ ప్రమాదంపై జీజీఎస్ సైట్ ఇన్చార్జి బిపిన్ ప్రసాద్ మాట్లాడుతూ అక్కడ పీచు ఫ్యాక్టరీ వద్దని తాము అభ్యంతరం చెప్పినా వినకుండా ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలకు నిప్పు.. పొంచి ఉన్న ముప్పు ఓఎన్జీసీ తూర్పుపాలెంలో జీజీఎస్ ఏర్పాటు చేసి సుమారు 25 ఏళ్లు కావస్తోంది. నిబంధనల ప్రకారం దీని పరిసరాల్లో విద్యుత్ వాహకాలు, తేలికగా మండే స్వభావం గల పీచు వంటి వాటితో ఏర్పాటయ్యే ఎలాంటి సంస్థలూ ఉండ కూడదు. అంతవరకూ.. ఎందుకు ఎక్కడ షార్ట్సర్క్యూట్లు అవుతాయోనన్న జంకుతో ఓఎన్జీసీ తన సైట్లలో ఏపీ ట్రాన్స్కో విద్యుత్ను కూడా వినియోగించదు. విద్యుత్ అవసరాల కోసం ఆయిల్ జనరేటర్లనే వాడుతుంది. అయితే తూర్పుపాలెం జీజీఎస్కు చేర్చి, ఏకంగా విద్యుత్ సబ్స్టేషనే ఉంది. దానికి తోడు చిన్నపాటి నిప్పురవ్వలకు సైతం మంటలు రగులుకునే పీచు ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. సుమారు 40 ఎకరాల్లో విస్తరించిన జీజీఎస్కు.. సమీపంలోని దాదాపు 30 బావుల నుంచి ఆయిల్, గ్యాస్ పైపులైన్లు అనుసంధానమై ఉంటాయి. ఇక్కడి భారీ ఆయిల్ ట్యాంకుల నుంచి ప్రతి రోజూ 30 ట్యాంకర్లకు పైగా చమురును రిఫైనరీకి తరలిస్తారు. మారణహోమం సృష్టించిన నగరం దుర్ఘటన నుంచి, అలాంటిదేమీ లేకుండా కరుణించి, విడిచిపెట్టినా.. విలయం పొంచి ఉందన్న హెచ్చరికలా మిగిలిన తూర్పుపాలెం ఘటన నుంచీ చమురు సంస్థలు తక్షణం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడి సిరిని తరలించుకుపోవడానికే కాక.. ఎంత సిరి పెట్టినా కొనలేని ప్రాణాలకు రక్షణ కల్పించడానికీ నడుం బిగించాలి. లాభాపేక్షే కాక జనక్షేమం పట్ల కూడా తమకు నిబద్ధత ఉందని నిరూపించుకోవాలి. ప్రతి పనినీ, ప్రతి కార్యస్థానాన్నీ నూరుశాతం నిబంధనలకు అనువుగా నిర్వహించాలి. -
చెట్టంత నష్టానికి..చిగురంత పరిహారమా?
- నగరం కొబ్బరిరైతుల ఆక్రోశం - పేలుడుతో కాలిన మానులు పేదలవే - రూ.25 వేలు చెల్లించాలని మొత్తుకోలు - అన్నీ కలిపి రూ.9,600లే అంటున్న అధికారులు నగరం (మామిడికుదురు) : కోనసీమ కల్పవృక్షం కొబ్బరిచెట్టు. సదా హరితంతో నిండి ఉండే ఈ గడ్డ సమున్నతంగా ఎగరేసిన పచ్చని కేతనం కొబ్బరిచెట్టు. చల్లనినీడనూ, అంతకన్నా చల్లనైన, తియ్యనైన నీటినీ ఇచ్చే ఈ మానులే నగరంలో.. గెయిల్ పైపులైన్ కక్కిన మహాగ్ని కీలల్లో మాడిమసైపోయాయి. ‘కొబ్బరిచెట్టుంటే కొడుకు పెట్టు, పది కొబ్బరి చెట్లుంటే కడుపులో చల్లకదలకుండా బతికేయవచ్చు అనే ఈ సీమ భరోసాను వమ్ము చేస్తూ క్షణాల్లో వట్టి కట్టెల్లా మారిపోయాయి. మండలంలోని నగరం గ్రామంలో గత నెలలో జరిగిన గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఇరవై మందిని పైగా పొట్టన పెట్టుకుంది. వందలాది కొబ్బరిచెట్లనూ నిలువునా దగ్ధం చేసింది. కొన్ని వందల చెట్టు దెబ్బ తిన్నాయి. దెబ్బ తిన్న చెట్లు, పుంజుకుని, కాపు కాసేందుకు మరో రెండు మూడేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలైన ఆ కొబ్బరి రైతుల గుండె.. నష్టపరిహారం కోసం ప్రభుత్వాధికారులు కడుతున్న లెక్కలను చూసి భగ్గున మండుతోంది. చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని మొత్తుకుంటున్నా పాలకుల్లో, అధికారుల్లో చిరుగాలికి ఊగే కొబ్బరాకు పాటి కదలిక కానరావడం లేదు. చెట్టుకు రూ.ఆరు వేలు మాత్రమే ఇస్తామంటున్న సర్కారు మాటలు.. రైతులను హతాశులను చేస్తున్నాయి. ఒక్కో చెట్టుకు రూ.50 వేల నష్టం ఒక్కో కొబ్బరి చెట్టు ఏడాదికి 500 నుంచి 600 కాయల దిగుబడినిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక చెట్టు నుంచి సంవత్సరానికి రూ.3,500 నుంచి రూ.4 వేల ఆదాయం వస్తుంది. కొబ్బరి మొక్క నాటాక పూర్తిస్థాయిలో కాపు కాసేందుకు 15 ఏళ్లు పడుతుంది. ఈ లెక్కన ఒక చెట్టు ద్వారా 15 ఏళ్లకు వచ్చే ఆదాయం రూ.50 వేలకు పైబ డే ఉంటుంది. కానీ అధికారులు ఇంత పరిహారం చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. పేలుడు వల్ల దెబ్బతిన్న చెట్టుకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. కాలిపోయిన చెట్టును గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొలగించి, దాని స్థానే కొత్త మొక్కను పాతి ఇస్తామని, కాలిపోయిన మట్టిని తీసి కొత్త మట్టిని వేస్తామని చెబుతున్నారు. దీనికి మొక్కకు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. దీంతో పాటు మొక్క పాతిన ఏడేళ్ల వరకు పోషణకు రూ.1600 వరకు చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే చెట్టుకు ప్రభుత్వం చెల్లించే పరిహారం రూ.9,600 అవుతోంది. అంటే రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్న మాట. వేసవిలో మండిపడ్డ ఎండలు తమను ఉక్కపోతకు గురి చేస్తే, గెయిల్ అధికారుల నిర్లక్ష్యం రేపిన మంటలు తమ బతుకుల్నే చిక్కుల్లోకి నెట్టాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. రైతులు ఆశిస్తున్న రూ.25 వేల నష్ట పరిహారం న్యాయబద్ధమైనదేనని పలువురు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు. వారి మాటలు, రైతుల గోడు ఆలకించి, పరిహారం రైతులు తేరుకునేలా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రూ.25 వేలు చెల్లించకుంటే ఉద్యమిస్తాం.. చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాల్సిందే. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమిస్తాం. గెయిల్ అధికారులు పరిహారం చెల్లించేందుకు సిద్దంగానే ఉన్నా జిల్లా అధికారులే అందుకు సమ్మతించడం లేదు. మా న్యాయమైన డిమాండ్ను అర్థం చేసుకుని, ఆదుకోవాలి. - వానరాశి వీరశంకరరావు, కొబ్బరి రైతు, నగరం నామమాత్రపు పరిహారం ఇస్తామంటే చెల్లదు గ్యాస్ పైపులైన్ పేలుడు మమ్మల్ని పాతాళంలోకి నెట్టేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరి ప్రాణాలు పోయాయి. కొబ్బరిచెట్లు మాడి పోయాయి. మా భూముల్ని కొనే నాథుడు కనిపించడం లేదు. కొబ్బరి చెట్లకు నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తాం. - వానరాశి వీరరాఘవులు, కొబ్బరి రైతు, నగరం -
నగరం ఘటనలో 20 మంది మృతి
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ నుంచి కాకినాడ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. మొత్తం 14 ఎకరాల పరిధిలో పేలుడు ప్రభావం ఉన్నట్లు తేల్చారు. కాగా, మరోవైపు నగరం ఘటనపై నేడు అఖిలపక్షం భేటీ కానుంది. నగరం గ్రామాన్ని తాము దత్తత తీసుకుని దాన్ని మోడల్ విలేజ్గా మారుస్తామని ఇప్పటికే గెయిల్ ప్రకటించింది. అయితే, శ్మశానంలా మారిన గ్రామాన్ని ఏం చేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామం గుండా ఇప్పటికీ పైపులైన్లు వెళ్తున్నాయని, వాటిని పూర్తిగా మార్చడమో లేదా తీసేయడమో చేస్తే తప్ప ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడదని వారు అంటున్నారు. -
బ్లోఅవుట్కు కారకులెవరు?
తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే ఇంక పీఎస్యూ నిర్వాహకులకు వాటిపై ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అలసత్వం, నిర్లక్ష్యం పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్ను సరఫరా చేసే ‘గెయిల్’ పైప్లైన్ బద్దలై సంభవించిన భీకరమైన విస్ఫోటనంలో అనేకమంది నిండు ప్రాణాలు కోల్పోయారు. సహజవనరులతో, పాడిపంటలతో, సుందరమైన ప్రకృతికి ఆలవాలమైన జిల్లాలో కొన్ని గ్రామాలను ఈ ఘోరకలి దఫదఫాలుగా కబళించుతూ రాష్ట్రాభివృద్ధికి, పర్యావరణ రక్షణకు పెద్ద చేటుగా మారింది. 1993 నుంచి తాజాగా నగరం గ్రామ దుర్ఘటనతో కలుపుకుని ఒకే జిల్లాలో గత 21 సంవత్సరాలలో ఏకంగా ఏడుసార్లు బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజి సంఘటనలు సంభవించాయి. తెలుగు గ్రామసీమల్లో తొలికోడి మేలుకొలుపులతోనే రైతులు, వ్యవసాయ కూలీలు, గృహిణులూ, తమతమ నిత్యవ్యాపకాల్లో మునిగిపోవడం సహజం. కాఫీలకూ, వంటకాలకూ పొద్దుపొడవకముందే పొయ్యి అంటించుకోవడం పల్లెల్లో సాధారణ దృశ్యం. కాని నగరం గ్రామంలో జరిగిన ఘోరకలికి ప్రభుత్వరంగ చమురు సహజవాయువు ఉత్పత్తి కంపెనీ ఓఎన్జీసీ, ఉత్పత్తి చేసిన గ్యాస్ను సరఫరా చేసే మరో ప్రభుత్వరంగ కంపెనీ ‘గెయిల్’ తమ నిర్వహణ లోపాలకు దేనికదే గ్రామస్తులపైకి నెట్టే పనిలో ఉన్నాయి! అసలు లీకేజీకి బాధ్యత తమది కాదన్నట్టుగా, ‘దాసుడి తప్పు దణ్ణంతో సరి’ అన్న చందంగా ఒక సామాన్య ‘టీ’ దుకాణదారుడు ‘స్టవ్’ వెలిగించినందువల్లనే ఈ పేలుడు సంభవించిందని చెప్పి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుతో సరిపెట్టుకుందామని ఈ సంస్థలు చూస్తున్నాయి! మాడి, మసైపోయిన కుటుంబాలకు పరిహార చెల్లింపులతో చేతులు దులుపుకోవడం ధనికవర్గ వ్యవస్థలో ఒక క్రూరమైన జోక్! అంతేగాని, తాజా ఘటనకు సంబంధించి గ్రామస్తులు గత రెండు మాసాలనాడే ఇదే పైప్లైన్వల్ల లీకేజీ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ లైన్ను తాత్కాలికంగా సర్దుబాటు చేసి వెళ్లారేగాని, మళ్లీ దానివైపు చూసిన పాపాన పోలేదనీ, ఫలితంగా అదే పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వెల్లడించారు. అంటే లీక్ అయిన గ్యాస్ క్రమంగా పరిసరాలలో వ్యాపించిపోయి ఉంది. ఆ సమయంలో ‘టీ’ దుకాణదారు ఇంట్లో ఉన్న పొయ్యికీ దీనికీ సంబం ధం లేదు. కాని ఆ సమయంలో పొయ్యి అంటించబోగా భగ్గుమని మంటలు రావడానికి కారణం అప్పటికే పైప్లైన్ నుంచి లీకయి వాతావరణంలో వ్యాపిం చిన గ్యాస్ వెంటనే అంటుకుందని అర్థమవుతుంది. పైగా పాశ్చాత్య దేశాల్లో గ్రామాల మధ్యనుంచో, గ్రామాలను ఆనుకునే గ్యాస్ పైప్లైన్లు వేయరనీ, గ్రామాలకు 5-6 కిలోమీటర్ల దూరంగా ఈ లైన్లు పరుస్తారని నిపుణులు చెపుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిమిత నష్టం పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు సంభవించవని కాదు. అయితే అవి ఎక్కువ భాగం కోస్తా తీరానికి దూరంగా సముద్రంతర వేదికలు ఆధారంగా డ్రిల్లింగ్లు, ప్రయోగాలు, లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో భారీ విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాంటివి ఆస్ట్రేలియా, నార్వే, నార్త్ సీ ప్రాంతాల్లో జరిగాయి. ఆ ప్రయోగాలు, డ్రిల్లింగ్లూ గ్రామాలనూ, కుటుంబాలనూ బూడిదపాలు చేయలేదు, శ్మశానవాటికలుగా మార్చలేదు. కాని ఇండియాలో మాత్రం ‘గెయిల్’, ఓఎన్జీసీ సంస్థలు ఇందుకు సంబంధించి అంతర్జాతీయ భద్రత, రక్షణ ప్రమాణాల నిబంధనలను పాటించడం లేదు. పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఆయిల్ పరిశ్రమ ‘‘భద్రతాధికార సంస్థ’’(ఓఐఎస్డీ) నిబంధనలనూ పాటించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ ప్రాధికార సంస్థ అయిన ‘సేఫ్టీ డెరైక్టరేట్’ పెట్రోలియం-గ్యాస్ మంత్రివర్గం కనుసన్నల్లోనే పనిచేయాలి! భద్రతా ప్రమాణాలు గాలికి 2009లో మరొక ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైపూర్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో డజను మంది ఆహుతి అయినప్పుడు ఆయిల్ పరిశ్రమ తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ప్రత్యేక సదస్సు జరిగినా ఫలితం లేకపోయింది. ఆయిల్ పరిశ్రమల నిర్మాణం, నిర్వహణ సమయాలలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రూపొందించిన సాధికారమైన ప్రమాణాలను పాటించడంలో ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయని చమురు పరిశ్రమ నిపుణులు పలుసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ‘గెయిల్’, ఓఎన్జీసీ కంపెనీలు తరచుగా ఆ ప్రమాణాలను పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ విధానాల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 1991లో ప్రపంచబ్యాంకు రుద్దిన ప్రజావ్యతిరేక సంస్కరణలను బేషరతుగా కేం ద్రం ఆమోదించింది లగాయతు నియంత్రణ వ్యవస్థ నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుని కేవలం దేశ, బహుళజాతి కంపెనీలకు ‘బ్రోకర్’గా పని చేయసాగింది. ఫలితంగా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు అంతకుముం దు ‘నవరత్నాల’లో భాగంగా ఉన్నా, ఆ సంస్థలలోని ప్రభుత్వ, అంటే ప్రజల వాటా ధనాన్ని కాస్తా క్రమంగా విదేశీ కంపెనీలకు, లేదా రిలయ న్స్ లాంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలకు అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీలపై ప్రభుత్వానికి నియంత్రణ, అధికారాలు సడలిపోయాయి. ఆ సంస్థల లాభాలు కాస్తా ప్రైవేట్ కంపెనీల పరమవుతున్నాయి. విదేశీ దిగ్గజాలకు ఎర్రతివాచీ ప్రపంచంలో పెట్రోలియం, గ్యాస్ వనరులపై కన్నుపడడం అనేది ఓ భారీ వ్యాపారం. ఇందులో బహుళజాతి కార్పొరేట్ కంపెనీల పాత్ర పెద్దది. ఈ వనరుల కోసమే, వాటిమీద ‘భల్లూకపు’ పట్టు సాధించడం కోసమే అఫ్ఘానిస్థాన్, ఇరాక్, తదితర పశ్చిమాసియా, మధ్యాసియా గ్యాస్ నిల్వల కోసం యుద్ధాలే జరిగాయి, జరుగుతున్నాయి! అలాగే మన దేశం లోని ఆయిల్ సంపదపై విదేశీ కంపెనీల పెత్తనానికి ద్వారాలు తెరిచింది కాంగ్రెస్, యునెటైడ్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలేనని మరచిపోరాదు. వీటిలో యూపీఏ, ఎన్డీఏలది ప్రధాన పాత్ర. ఈ రెండు ప్రధాన కూటములూ విదేశీ ఆయిల్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోయి, దేశీయంగా చమురు ఉత్పత్తికి గండికొట్టాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలను కుంటుపరిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. విదేశీ కంపెనీలకు, వారితో మిలాఖత్ అయిన రిలయన్స్ లాంటి ఒకటి రెండు దేశీయ కుబేర కంపెనీలు వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలను ఏకపక్షంగా నిర్ణయించి ప్రజలపై రుద్దే శక్తినీ ఇచ్చాయి! 1998లో కిరోసిన్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్పై సబ్సిడీలను ఉపసంహరించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుదే. ‘గెయిల్’ కింద నిర్వహిస్తున్న ప్రధాన గ్యాస్ క్షేత్రాలలో షేర్లను 18 శాతం పైగా విదేశీ కంపెనీ ‘ఎన్రాన్’కు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్కు అమ్మేసింది బీజేపీయే. చివరికి గ్యాస్ను మండించడానికి సైతం ప్రపంచ బ్యాంకు నుంచి రుణంకోసం అంగలార్చిందీ ప్రభుత్వ ఆయిల్ సంస్థే! తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను ఇలా నిర్వీర్యం చేసి, వాటిలోని ప్రజాధనాన్ని కాస్తా తక్కువ శాతానికి వాటాల రూపంలో విదేశీ, స్వదేశీ గుత్త కంపెనీలకు ధారాదత్తం చేసిన తర్వాత ఇంక పీఎస్యూల నిర్వాహకులకు ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అల సత్వం, నిర్లక్ష్యం, పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement