పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ

4 Mar, 2014 03:21 IST|Sakshi

తిరువూరు, న్యూస్‌లైన్: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్‌ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరువూరులోని కూరగాయల మార్కెట్ పక్కన నివసిస్తున్న వ్యాపారి రాయల ప్రభాకరరావు ఇంట్లోకి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు  యువకులు ప్రవేశించి ఆయన భార్య శకుంతలను మంచినీళ్లు అడిగారు.

నీరిచ్చేలోపు ఆ ఇద్దరూ తమతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో చల్లి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కారు. ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో పరారయ్యారు. స్ప్రే ప్రభావంతో శకుంతలకు ఊపిరాడని పరిస్థితితో పాటు ముక్కునుంచి రక్తస్రావమైంది. ఈ ఘటనపై ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు మచిలీపట్నం నుంచి క్లూస్ టీంను రప్పించి నిందితుల ఆచూకీ కోసం  గాలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు