వాల్మీకిపురం: వాల్మీకిపురం మండలంలో శుక్రవారం ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని సాకిరేవుపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డి.శేఖర్ (35) కొన్ని సంవత్సరాలుగా కలికిరి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్య భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
జీవితంపై విరక్తి చెందిన శేఖర్ శుక్రవారం ఉదయం తన పిల్లలు లక్ష్మి (10), ప్రదీప్ (8), ప్రణీత (7)లను వడ్డిపల్లెలోని తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. విషం కలిపిన సీతలపానీయం వారికి తాపి, తానూ తాగేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు.