తెలుగు సంస్కృతి నేర్పుతున్నారు : రాష్ట్రపతి 

22 Feb, 2019 14:05 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : అక్షర స్కూల్‌ ఇంగ్లీష్ మీడియం అయినా.. తెలుగు సంస్కృతి నేర్పుతున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. స్వర్ణభారతి ట్రస్ట్‌ 18వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనకు అత్యంత ఆప్తులని తెలిపారు. మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా.. సమాజానికి ఏదో ఒక సేవ చేయాలన్నారు. వెంకయ్య నాయుడు జీవితంలో ఎంతో సాధించాడని, ఆయన అందరికీ అజాతశత్రువన్నారు. వెంకయ్య నాయుడు తెలుగు సంస్కృతిని కాపాడేందుకు చేస్తున్న సేవలు అభినందనీయని, మరిన్ని సేవా  కార్యక్రమాలు చేపట్టి స్వర్ణభారత్‌ ప్రజలకు చేరువ కావాలని కోరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ప్రారంభించామన్నారు. ట్రస్ట్‌ ద్వారా ఆంధ్ర, తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలకు స్వయం శక్తితో ఎదిగేలా శిక్షణనిచ్చామన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తన పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినా సంతోషమేనని... అక్కడ చేసే సేవనే స్వర్ణభారత్ ద్వారా ఇక్కడా చేస్తున్నారని అన్నారు. 

మరిన్ని వార్తలు