ఆయేషా మృతదేహానికి నేడు రీ పోస్ట్‌మార్టం

14 Dec, 2019 04:24 IST|Sakshi

సాక్షి, అమరావతి/తెనాలి రూరల్‌:  దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్‌ ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. హత్య జరిగిన 12 ఏళ్ల అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు నెలల క్రితమే రీ పోస్ట్‌మార్టం చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధపడగా, మత పెద్దలు అంగీకరించడం లేదని ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు.

కోర్టు ఉత్తర్వులతో చేపడతామని అప్పట్లో సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, రీ పోస్ట్‌మార్టం చేయడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. 14న రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు తమకు సహకరించాలని సీబీఐ అధికారులు తెనాలి సబ్‌ కలెక్టర్‌కు ఈ నెల 12న లేఖ రాశారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని శుక్రవారం తహసీల్దార్‌ కె.రవిబాబు, ఇతర అధికారులు, పోలీసులు పరిశీలించి ఆయేషా సమాధిని గుర్తించారు.

మరిన్ని వార్తలు