శైవక్షేత్ర దర్శనభాగ్యం

27 Oct, 2019 04:36 IST|Sakshi

కార్తీక మాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సులు

నవంబరు 2నుంచి సర్వీసులు

ప్యాకేజీలు ప్రకటించిన ఆర్టీసీ

బస్‌స్టేషన్‌(విజయవాడ పశ్చిమం): కార్తీక మాసం ప్రారంభం కానున్న నేప«థ్యంలో ఏపీఎస్‌ ఆర్టీసీ భక్తులకు శైవక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు ఐదు పంచారామాల్లోని వెలసిన శివుని దర్శనం చేసుకోనేలా ప్యాకేజీ ప్రకటించింది. కృష్ణా రీజియన్‌ పరిధిలోని నవంబర్‌ 2వ తేదీ నుంచి 13 రోజుల పాటు భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు తిప్పునున్నారు.  

ఐదు పంచారామాలకు బస్సులు
అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచా రామాల శైవక్షేత్రాల్లో వెలసిన శివుని దర్శనం చేసుకొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మాసంలోని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారాల్లో పాటు ముఖ్యమైన రోజుల్లో ఈసదుపాయం కలిగేవిధంగా నవంబర్‌ 2,3,4,9,10, 11, 16,17,18,23,24,25 తేదీలు నిర్ధారించారు. ఈమేరకు విజయవాడ నుంచి ఆటోనగర్‌ టెర్మినల్, పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ నుంచి ఉదయం 3 నుంచి 4 గంటల వ్యవధిలో బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు నడుపుతున్నట్లు జయరావు తెలిపారు. ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో, ఆథరైజ్డ్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సెంటర్లలో రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని వారు తెలిపారు.

బస్‌ చార్జీలు ఇలా..
విజయవాడ నుంచి పంచారామాలలోని శైవక్షేత్రాలకు సూపర్‌లగ్జరీ టిక్కెట్‌ పెద్దలకు రూ.880 , పిల్లలకు రూ.660 వరకు నిర్ణయించారు. అలాగే అల్ట్రా డీలక్స్‌లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630 వరకు చెల్లించాల్సి ఉందని ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

త్రిలింగ దర్శిని 
యాగంటిలో కొలువైఉన్న శ్రీఉమామహేశ్వర స్వామిని దర్శనం, శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి వారి, వాటితోపాటు మహానందిలోని స్వామి వారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు. సూపర్‌ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయగా పెద్దలకు రూ.1430, పిల్లలకు రూ.1080 కేటాయించారు. త్రిలింగదర్శిని కోసం ఏర్పాటు చేసిన సర్వీసులు శనివారం రాత్రి గం.8.00 బయల్దేరి తిరిగి సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌కు చేరుతాయి. మరింత సమచారం కోసం ఫోన్‌ నెంబరులో 8074298487 సంప్రదించాలని కోరారు.  

మరిన్ని వార్తలు