ధనం కన్నా విద్య మిన్న

27 Jul, 2014 01:53 IST|Sakshi
  • కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు
  • కురుమద్దాలి(పామర్రు) : అడ్మిషన్ రిజిష్టర్‌లో విద్యార్థి పేరుమాత్రమే న మోదు చేస్తే చదువు వచ్చినట్లు కాదని, అతని చదువు విషయమై అధికారులు ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడే విద్యావంతులవుతారని కలెక్టర్  ఎం.రఘునందన్‌రావు చెప్పారు. శనివారం మండల పరిధిలోని కురుమద్దాలి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది‘ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు బడి ఉత్సవమ్ నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేశారు.  

    కలెక్టర్ మాట్లాడుతూ బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గతంలో ధనం అధికంగా ఉన్న కుటుంబాలను గౌరవించేవారని ప్రస్తుతం విద్యావంతులను అంతకన్నా ఎక్కువగా  గౌరవిస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి తల్లితండ్రులకు వివరించాలన్నారు. పెరుగుతున్న విద్యాప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలలో విద్యాబోధన జరపాలన్నారు.    

    గ్రామస్థాయిలోని అధికారులు, రాజకీయవేత్తలు పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మురళీ మాట్లాడుతూ ఇంగ్లిష్ మోజులో తల్లితండ్రులు తమ చిన్నారులను  కాన్వెంట్లకు పంపాలని చూస్తున్నారని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాల ల్లోనూ 1 వ తరగతి నుంచి ఇంగ్లిష్ బోధించే విధానాన్ని  ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పక్కా భవనాల్లో నిర్వహిస్తూ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నాణ్యమైన  మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందజేస్తున్నామిన తెలిపారు.

    అలాగే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నామని చెప్పారు. పాఠశాల పరిధిలోని ఇద్దరు డ్రాప్ అవుట్  విద్యార్థులు సాదాపు భవాని, బెజవాడ గోపాలకృష్ణను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. తల్లితండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మూలంగా 8 వ తరగతిలో పాఠ్యాంశాలు సక్రమంగా జరగడంలేదని, అదే విధంగా పాఠశాలలో తాగునీటి వసతి సక్రమంగా లేదని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయమై  చర్యలు తీసుకుంటానని తెలిపారు.

    డీవైఈవో వెంకటేశ్వరరావు, గ్రామసర్పంచి కొసరాజు స్వప్న, జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉష, ఎంపీటీసీ కొలుసు ఆదిలక్ష్మీ, తహసీల్దార్ మూర్తి, ఎంఈవో భవిరి శంకర్‌నాథ్, ఎంపీడీవో జె.రామనాథం, పాఠశాల హెచ్‌ఎం అంబటి ఉషాకుమారి, ఏఎంసీ చైర్మన్ లక్ష్ష్మణరావు, సీఆర్‌పీలు   పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు