మా కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించం

10 Aug, 2014 02:16 IST|Sakshi
మా కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించం

 పూండి :వజ్రపుకొత్తూరు మండలంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మా కార్యకర్తలపై దాడులకు పాల్పడి బెదిరిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అన్నారు. శనివారం మండలంలోని అక్కుపల్లి గ్రామంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల దాడులు ఎదుర్కొంటున్న అక్కుపల్లి మాజీ సర్పంచ్ లండ రామలింగంతో కలసి ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దని సూచించారు. గ్రామంలో టీడీపీ నాయకుల అన్యాయూలను ఎదిరిస్తే చంపేస్తాం అని వాల్‌పోస్టర్స్ వేయించి మరీ బెదిరించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు.
 
 ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా లేక అధికార పార్టీ నాయకులా అని జగన్నాయకులు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇదే వ్యవహారశైలి అనుసరిస్తే డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి కార్యకర్తలతో కలసి ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు  ఉద్యమాలు చేయడానికి  సిద్ధంగా ఉన్నామని జగన్నాయకులు తెలిపారు.  కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బైపల్లి సర్పంచి, మడ్డు రాంప్రసాద్, ఎం. వరప్రసాద్, బి. భూపతి, అర్లి వల్లభరావు, పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ కౌన్సిలర్ ఎం. సురేష్, ఎస్.డిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు