ట్రాక్టర్‌ బోల్తా.. పెళ్లింట్లో విషాదం

2 Apr, 2017 10:48 IST|Sakshi

కర్నూలు: మూడు ముళ్ల బంధం కోసం బయల్దేరిన పెళ్లి కూతురి తరఫు వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసమ్మ(55) అనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. జిల్లాలోని అస‍్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన తిక్కయ్య కూతురు లక్ష్మికి పత్తికొండ మండలం అటికెలగుండు నాగేష్‌ కొడుకు రాజుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి కొడుకు ఇంటికి తలంబ్రాలు తీసుకెళ్లాల్సివుండటంతో  అమ్మాయి తరఫు వారు 40 మంది ట్రాక్టర్లో అటికెలగుండుకు బయల్దేరారు.

ములుగుందం దాటిన తర్వాత కైరుప్పల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లి కూతురితో పాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు