పాపం పసివాళ్లు..

21 Nov, 2017 08:19 IST|Sakshi

పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యాయత్నం 

ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారులు

అపస్మారక స్థితిలో తల్లి ఆశ్విని  

 భర్త, అత్త వేధింపులే కారణమని ఫిర్యాదులు

ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి కాస్తా పెద్దవయ్యాయి.  భార్య పిల్లలను పుట్టింట్లో వదిలేసేటంతగా అవి పెరిగాయి. దీంతో భార్య మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. వారితో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో చిన్నారులిద్దరూ చనిపోగా.. తల్లిని మాత్రం స్థానికులు రక్షించారు. ఆవేశంలో.. ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం.. ఆ చిన్నారులను బలితీసుకుంది. కోరుకొండలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కోరుకొండ (రాజానగరం): గ్రామానికి చెందిన అశ్వినికి రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిత్యశర్వాణి(3), జయదేవ్‌ విక్రమ్‌(ఆరు నెలల బాబు) ఉన్నారు. కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. 20 రోజుల క్రితం నాగిరెడ్డి శ్రీనివాస్, అశ్విని, పిల్లలతో సహా యానాంలో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్‌ కోరుకొండకు అశ్వినితో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తీసుకువచ్చి, వదిలి వెళ్లిపోయాడు. దీంతో అశ్విని మానసికంగా బాధపడుతూ చనిపోవాలనుకుంది. తాను చనిపోతే ఇద్దరు పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది.

 ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్న బావిలో ఆదివారం అర్ధరాత్రి దూకింది. దీంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, అశ్వినిని మాత్రం చుట్టుపక్కల వారు రక్షించారు. అయితే చిన్నారులను కోరుకొండ శ్మశానంలో పూడ్చివేశారు. చివరకు కోరుకొండ వీఆర్‌ఓ యు.సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త శ్రీనివాస్, అత్తగారు వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం కోరుకొండ తహసీల్దార్, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో పూడ్చివేసిన బాలిక, బాలుడి శవాలను వెలికితీస్తామని డీఎస్పీ తెలిపారు. 

భర్త, అత్త వేధింపుల వల్లే..
భర్త శ్రీనివాస్, ఆమె అత్త వేధింపుల వల్లే నాగిరెడ్డి ఆశ్విని  ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కోరుకొండ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, సీఐ ఎన్‌. మధుసుధనరావు, ఎస్‌ఐ రావూరి మురళీమోహన్‌ నాగిరెడ్డి ఆశ్విని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. శ్మశానం వద్దకు వెళ్లి పూడ్చివేసిన బాలుడు, బాలిక ప్రదేశాన్ని పరిశీలించారు. 

>
మరిన్ని వార్తలు