స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

21 Feb, 2019 13:27 IST|Sakshi
నరసమ్మ మృతదేహం (ఇన్‌సెట్‌లో) నర్సమ్మ (ఫైల్‌)

 రెండు వారాలుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స

పరిస్థితి విషమించడంతో మృత్యువాత

గుంటూరు, తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ మహిళ మృతిచెందింది. గుండిమెడ గ్రామానికి చెందిన పునుకుపాటి నర్సమ్మ (34) కూలి పనులు చేసుకొని, భర్త పిల్లలతో నివాసం ఉంటోంది. రెండు వారాల క్రితం ఆమె జలుబు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో నరసరావుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ సోకిందని చెప్పారని బంధువులు తెలిపారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడం, కార్పొరేట్‌ వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో బంధువులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ప్రభుత్వస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గుండిమెడకు తీసుకొచ్చారు. స్వైన్‌ఫ్లూతో నర్సమ్మ మృతి చెందిందని ప్రచారం జరగడంతో తాడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌నాయక్‌ ఆమె ఇంటికి వెళ్లి గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్టులు పరిశీలించారు. నర్సమ్మ సుగర్‌ రోగి అని, థైరాయిడ్‌కు కూడా మందులు వాడుతోందని, ఎక్కడా స్వైన్‌ఫ్లూ టెస్ట్‌లు చేయలేదని, ప్రైవేటు వైద్యులు సస్పెక్టెడ్‌ స్వైన్‌ఫ్లూగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందిన నర్సమ్మకు ఆల్కలైన్‌ ఎసిడోసిస్, బైలేటరల్‌ లంగ్స్‌ న్యూమోనియాగా నిర్ధారించారని వివరించారు.

మరిన్ని వార్తలు