యువకుడు అనుమానాస్పద మృతి

11 Nov, 2018 07:43 IST|Sakshi

అఖింఖాన్‌పేటలో ఘటన

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం పంచాయతీ అఖింఖాన్‌పేట సమీపంలో పొలం గట్టుపై శనివారం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తులకు స్థానిక యువకుడు పిలక అప్పలరాముడు(26) శవమై కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అఖింఖాన్‌పేటకు చెందిన అప్పలరాముడు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.

 ఈయన తండ్రి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యం కాగా, తల్లి మృతి చెందింది. మేనమామ కోటేశ్వరరావు చేరదీసి 2017 మే 3న తన కుమార్తె భవానీతో వివాహం చేశాడు. కొంతకాలంగా వీరు బెంగళూరులో తాపీ పనిచేస్తూ జీవనం సాగించారు. తర్వాత స్వగ్రామం వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. శుక్రవారం గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న అప్పలరాముడు రాత్రి 9 సమయంలో బయటకు వెళ్తున్నట్లు భార్యతో చెప్పాడు. తర్వాత తిరి గిరా లేదు. శనివారం ఉదయం భర్త శవమై కని పించటంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

అనుమానాస్పద కేసుగా నమోదు..
భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుడి నోటిలో నురగ ఉండటం.. సమీపంలో పురుగుల మందు డబ్బా లేకపోవడం బట్టి ఆత్మహత్యా.. హత్యా అనే వివరాలు తెలియడం లేదు. పాముకాటుతో చనిపోయే అవకాశం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదు. దీంతో అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు బయటపడతాయని ఎచ్చెర్ల ఎస్‌ఐ కృష్ణ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామన్నారు. మృతుడి భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. అంతకుముందు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు