2 నెలల్లో రూ.50 కోట్ల సమీకరణ

22 Sep, 2017 00:32 IST|Sakshi
2 నెలల్లో రూ.50 కోట్ల సమీకరణ

► ఏడాదిలో వీఐపీ ఇన్నర్స్‌ సొంత స్టోర్లు
► రూ.230 కోట్ల టర్నోవర్‌; ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం
► మార్కెట్లోకి వీఐపీ రీగల్,  ఫ్రెంచి క్యాజువల్స్‌
► వీఐపీ క్లాతింగ్‌ సీఈఓ యోగేష్‌ తివారీ  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లో దుస్తుల వ్యాపారంలో ఉన్న వీఐపీ క్లాతింగ్‌ సంస్థ... రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.50 కోట్ల నిధులను సమీకరించనుంది. ఇప్పటికే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుంచి అనుమతులొచ్చేశాయని, సెబీ అనుమతి రావటమే తరువాయని కంపెనీ సీఈఓ యోగేష్‌ తివారీ తెలిపారు. 2 నెలల్లో అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి నిధులు సమీకరిస్తామని, వీటిని బ్రాండింగ్‌ కోసం వినియోగిస్తామని ఆయన చెప్పారు.

గురువారమిక్కడ వీఐపీ రీగల్, ఫ్రెంచి క్యాజువల్స్‌ బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేశారు. వీటి ధరల శ్రేణి వరుసగా రూ.189, రూ.229. అనంతరం సీఎండీ సునీల్‌ పఠారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వీఐపీ, ఫ్రెంచి, ఫీలింగ్, లీడర్, ఎమినెన్స్‌ ఐదు బ్రాండ్లలో 12 ఉత్పత్తులున్నాయి. ఇందులో వీఐపీ, ఫ్రెంచి పురుషుల లోదుస్తుల బ్రాండ్‌ కాగా, ఫీలింగ్‌ మహిళల లోదుస్తు ల బ్రాండ్‌. మా ఉత్పత్తుల విక్రయాల్లో వీఐపీ వాటా 45% వరకూ ఉంది’’ అని వివరించారు. ఈ ఏడాది ముగిసే నాటికి రీగల్, ఫ్రెంచి బ్రాండ్లను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేయాలని లకి‡్ష్యంచామన్నారు.

ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం..
దే
శంలో సంఘటిత లోదుస్తుల విపణి రూ.20 వేల కోట్లుగా ఉంటుందని యోగేష్‌ తివారీ చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.230 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో 24 శాతం వృద్ధిని లకి‡్ష్యంచామని తెలియజేశారు. ‘‘మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 8 శాతం వరకూ ఉంది. మా టర్నోవర్‌లో ఎగుమతుల వాటా రూ.20 కోట్లు. గల్ఫ్‌ దేశాలకు మా బ్రాండ్‌ను ఎగుమతి చేస్తున్నాం. మలేషియా, వియత్నాం, ఫిలిప్పిన్స్‌ దేశాలకు విస్తరించనున్నాం’’ అని తెలిపారు.

ఏడాదిలో సొంత స్టోర్లు..
ప్రస్తుతం దేశంలో వీఐపీకి 330 డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లున్నాయి. ఏపీ, తెలంగాణలల్లో 40 సెంటర్ల వరకూ ఉన్నాయి. వీఐపీ ఇన్నర్స్‌ పేరిట ముంబైలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 2 సొంత ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌లను సంస్థ ప్రారంభించింది. ప్రజాధరణ చూసి దీన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరిస్తామని యోగేష్‌ చెప్పారు. వీఐపీ క్లాతింగ్‌ బ్రాండ్ల ఉత్పత్తులు కూడా ఈ షోరూమ్‌లో లభ్యమవుతాయి కాబట్టే దీనిపేరును మ్యాక్స్‌వెల్‌ నుంచి వీఐపీ క్లాతింగ్‌గా మార్చామన్నారు. ‘‘ప్రస్తుతం మాకు గుజరాత్, తమిళనాడులో రెండు తయారీ కేంద్రాలున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 70 మిలియన్లు. ప్రస్తుతం 60 మిలియన్ల వరకు వినియోగిస్తున్నాం. ఆ తర్వాతే ప్లాంట్ల విస్తరణ చేపడతాం. ప్రతి 6 నెలలకొక ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తాం. త్వరలోనే నైట్‌వేర్‌ ఉత్పత్తులను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు