ఆగస్టులో మరోమారు రేట్‌కట్‌?!

22 May, 2020 16:37 IST|Sakshi

మోర్గాన్‌స్టాన్లీ అంచనా

వచ్చే పరపతి సమీక్షా సమావేశం నాటికి ఆర్‌బీఐ మరో 35 శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా అనలిస్టు కౌశిక్‌దాస్‌ అంచనా వేశారు. 2008 సంక్షోభానికి పూర్వం రివర్స్‌ రెపో 3.75 శాతం ఉండేదని, సంక్షోభానంతరం ఈ రేటను 3.25  శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభం ఇంకా పెద్దది కావడం వల్ల రివర్స్‌ రెపోను మరో 0.35 శాతం తగ్గించి 3 శాతానికి పరిమితం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆర్‌బీఐ తగ్గించిన రేట్ల ప్రకారం రెపో 4 శాతం, రివర్స్‌ రెపో 3.35 శాతానికి చేరాయి. ఆగస్టులో జరిగే తదుపరి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో కానీ, అంతకుముందే కానీ మరో 35 పాయింట్ల బేసిస్‌ పాయింట్ల తగ్గింపుంటుందని దాస్‌ చెప్పారు. బ్యాంకులు మరింత లిక్విడిటీ పెంచేలా ఆర్‌బీఐ రివర్స్‌ రెపో మార్గంపై పరిమితులుంచాలన్నారు. దీంతో పాటు స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ తీసుకువస్తారన్న అంచనాలున్నాయని చెప్పారు. ఈ రెండు విషయాలను మార్కెట్‌ ఆశిస్తోందని, దీంతో పాటు త్వరలో విడుల చేసే ప్రభుత్వ బాండ్లను ఎవరు కొంటారన్న అంశమై స్పష్టత రావాలని ఆయన అన్నారు. ఆర్‌బీఐ నుంచి బాండ్ల కొనుగోలు ప్రకటన, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన వస్తే మార్కెట్‌ సానుకూలంగా ఉండొచ్చన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు మరిన్ని రుణాలివ్వాలని ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడం లేదని, లిక్విడిటీపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు