పీఎన్‌బీలో ఏటీఎం ఫ్రాడ్‌ ప్రకంపనలు

17 Apr, 2019 14:23 IST|Sakshi

61 ఖాతాల్లోంచి  లక్షల డబ్బు  మాయం

మూడురోజుల్లో రూ. 15 లక్షలు గల్లంతు

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంలో చిక్కుకున్  పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు (పీఎన్‌బీ)లో  తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం ప్రకంపనలు రేపుతోంది.  ఏటీఎం మోసం ద్వారా పీఎన్‌బీ ఖాతాదారుల సొమ్మలు స్వాహా అయిపోతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేవలం  మూడు రోజుల వ్యవధిలో  61 మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏటీఎం మోసాలపై ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా...తగిన సూచనలు జారీ చేస్తున్నా ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్,  ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 న తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే  గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారుడు  పీఎన్‌బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించారు. దీంతో  బ్యాంకు అధికారులు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.  అనంతరం  ఫిర్యాదుదారుల జాబితా మరింత పెరిగింది.  బ్యాంకు  ప్రకటన ప్రకారం మొత్తం 14, 97,769 రూపాయల  సొమ్ము అక్రమార్కుల  జేబులోకి వెళ్లిపోయింది. దీనిపై కేసు నమోదు చేశామని వసంత్ విహార్  డీసీపీ(సౌత్‌ వెస్ట్‌) దేవేందర్‌ ఆర్యా వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు