వేలకోట్ల కుంభకోణం: నిరూపిస్తే తల నరకండి!

1 Mar, 2018 12:12 IST|Sakshi

సాక్షి ల​‍క్నో: బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేస్తున్న కేటుగాళ్ల జాబితా  పెరుగుతోంది.  వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ,  రోటోమాక్  అధినేత విక్రమ్ కొఠారీ, ఆర్‌పీ ఇన్ఫోసిస్టం శిబాజీ పంజా, ఇపుడిక వస్త్రాల తయారీ కంపెనీ శ్రీ లక్ష్మీ కొటిన్స్ లిమిటెడ్(ఎస్‌ఎల్‌:సీఎల్‌) అగర్వాల్‌ ఈ వరుసలో నిలిచాడు.  పీఎన్‌బీ, కెనరా బ్యాంకుల మాదిరిగాగానే   కాన్పూర్ నగరానికి  చెందిన ఈ కంపెనీ బ్యాంకులకు   సుమారు రూ.4వేలకోట్ల టోకరా వేసింది.  శ్రీలక్ష్మీ కొటిన్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఎంపీ అగర్వాల్ మొత్తం 16 బ్యాంకుల్లో రూ.3,972కోట్ల మేర  కుంభకోణానికి  పాల్పడ్డాడు.  దీంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరుకు చెందిన శ్రీ లక్ష్మీ కాట్సిన్ లిమిటెడ్ సంస్థ ..సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాతోపాటు మొత్తం 16 బ్యాంకుల నుంచి అగర్వాల్ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసింది. వస్త్రవ్యాపారంతో పాటు  ఆటోమొబైల్‌ బ్లాస్ట్‌ప్రూఫ్‌ వ్యాపారం కూడా  నిర్వహిస్తోంది..  అయితే క్రమంగా పెట్టుబడి మొత్తం కంటే నష్టాలు పెరిగిపోతుండటంతో కంపెనీ పునరుద్ధరణ అసాధ్యంగా మారింది. చివరకు నష్టాలు రూ. 1646.12 కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక రుణాలు రూ. 2406 కోట్లు కాగా, స్వల్పకాలిక రుణాలు రూ. 937 కోట్లున్నాయి.  ఇలా మొత్తం16 బ్యాంకుల (సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడిబిఐ బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎడెల్‌వీస్ ఎస్టేట్) నుంచి రూ. 3972 కోట్ల రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టింది.  దీంతో  కంపెనీ అధినేత అగర్వాల్‌ దేశం విడచిపోయారని, అప్పులను తీర్చే అవకాశమే లేదంటూ వార్తలు  వ్యాపించాయి.

అయితే ఈ వ్యవహారంపై కంపెనీ ఎండీ అగర్వాల్‌ స్పందించారు. నీరవ్‌మోదీ, రొటొమాక్‌ కుంభకోణంతో తమను పోల్చవద్దని మండిపడ్డారు. రుణమొత్తాలను తమ ఫ్యాక్టరీలలో పెట్టుబడులు పెట్టామనీ, తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని,  త్వరలోనే దేశం  విడిచిపోనున్నారనే  వార్తలను ఆయన  తోసిపుచ్చారు. బ్యాంకులోన్ల ద్వారా ఆస్తిని కొనుగోలు చేశానని ఎవరైనా నిరూపిస్తే..వాళ్లు తన తల నరకవచ్చవంటూ సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు