‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’

4 Jan, 2019 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు.

ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్‌పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్‌పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు.

దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్‌ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్‌పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు.

మరిన్ని వార్తలు