ఉద్యోగాలు పోతాయన్న భయం భారతీయుల్లోనే ఎక్కువ..ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పోతాయన్న భయం భారతీయుల్లోనే ఎక్కువ..ఎందుకంటే..

Published Mon, Oct 30 2023 11:04 AM

The Fear Of Losing Jobs Is More In Indians - Sakshi

అమెరికా, యూకే , జర్మనీలోని ఉద్యోగుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల తమ కొలువులు కోల్పోవడం పట్ల భారతీయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ క్వాటర్లీ పల్స్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం..అభివృద్ధి చెందిన దేశాల్లోని ముగ్గురిలో ఒకరికి ఏఐ వల్ల తమ ఉద్యోగం పోతుందనే భయం ఉంది. కానీ భారతీయ ఉద్యోగుల్లో ఆ ఆందోళన ఇద్దరిలో ఒకరికి ఎక్కువగా ఉంది.

భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెరగడానికి గల కారణాల్లో బీపీఓ, కేపీఓ రంగాల్లో పెద్ద సంఖ్యలో వర్క్‌ఫోర్స్ ఉండటం, ప్రత్యేకించి ఆ పనులన్నీ ఏఐతో ఆటోమేషన్‌ చేయడమేనని రాండ్‌స్టాడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్‌ విశ్వనాథ్ తెలిపారు. ‘ఇండియా ప్రధానంగా సర్వీస్‌ ఆధారిత సేవలు అందిస్తుంది. అందులో భాగంగా దేశంలో చాలా కేపీఓ, బీపీఓలు నెలకొల్పారు. అయితే భారత్‌లో ఉద్యోగులు ఏఐని సమర్థవంతంగా ఆచరణలో పెట్టే సత్తా కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐని స్వీకరించేది మన దేశంలోనే’ అని విశ్వనాథ్ అన్నారు. ఏఐ వల్ల కొన్ని రకాల కొలువులపై ప్రభావం ఉన్నా నిరంతరం తమ నిపుణ్యాలు పెంచుకునే ఉద్యోగులకు అపారఅవకాశాలు ఉంటాయన్నారు. 

(ఇదీ చదవండి: ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్‌..కారణం అదేనా..)

రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ ఎడిషన్ ద్వారా కార్మికుల నైపుణ్యాలు, సంస్థ డిమాండ్‌లు, ఏఐ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశంలోని 1606 ఉద్యోగులపై సర్వే చేశారు. వీరిలో 55% మంది పురుషులు, 45% మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు ఏఐ వారి పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని విశ్వసించారు. ఇదే సంఖ్యలో వారు నైపుణ్యాభివృద్ధి ఔచిత్యాన్ని గుర్తించారు. రాబోయే ఐదేళ్లలో తమ స్థానాల్లో కొనసాగాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం అని వారు నమ్ముతున్నారు. మెజారిటీ ఇప్పటికే తమ ప్రస్తుత ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. అయితే కొన్ని సంస్థల యాజమాన్యాలు మాత్రం వచ్చే 12 నెలల్లో తమ నైపుణ్యాలు పెంచుకునేలా ఎలాంటి అభివృద్ధి అవకాశాలను అందించకపోతే  ఉద్యోగాలను వదిలివేస్తామని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది. 

కృత్రిమ మేధతో ఉద్యోగాల ప్రభావం అనేది ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉండనుంది. అత్యధికంగా ఐటీ, సాంకేతిక అక్షరాస్యత, మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ సంబంధించిన ఉద్యోగాలు, ఆటోమోటివ్/ ఏరోస్పేస్ పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల తయారీ, ఆర్థిక సేవలను అందించే సంస్థలపై దీని ప్రభావం పడనుందని సర్వే తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement